కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పేరు జీవగ్రంథంలో ఉన్నదా?

మీ పేరు జీవగ్రంథంలో ఉన్నదా?

అధ్యాయం 11

మీ పేరు జీవగ్రంథంలో ఉన్నదా?

సార్దీస్‌

1. సార్దీస్‌ సంఘంలోని ఆత్మీయస్థితి ఎలావుంది, మరి యేసు తన వర్త మానాన్ని ఎలా ఆరంభిస్తున్నాడు?

ఆధునిక ఆఖిసర్‌ (తుయతైరకు) దక్షిణాన 30 మైళ్ల దూరంలోవున్న ప్రాంతమే మహిమనొందిన యేసు వర్తమానాన్ని పొందబోయే సంఘం: సార్దీస్‌. సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో యీ పట్టణం లిదియకు గొప్ప రాజధాని, కోసస్‌ అనే అధిక సంపన్నుడైన రాజుకు అది సింహాసనం. యోహాను కాలం నాటికి అది కష్టాల్లో కూరుకుపోయింది, మరి క్రోసస్‌ క్రిందనున్న గతవైభవమంతా వట్టి చరిత్రగా మిగిలిపోయింది. అలాగే, అక్కడున్న క్రైస్తవసంఘం ఆత్మీయంగా అణగారిపోయింది. యేసు తన వర్తమానాన్ని అభినందనతో ప్రారంభించక పోవడమిదే మొదటిసారి. బదులుగా ఆయనిలా అంటున్నాడు: “సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము—ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగా—నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే.”— ప్రకటన 3:1.

2. (ఎ) యేసు “యేడాత్మలను” కల్గివుండుట, సార్దీస్‌లోని క్రైస్తవులకు ఏ ప్రాముఖ్యత నిస్తుంది? (బి) సార్దీస్‌ సంఘానికి ఏ కీర్తి వుండేది, గాని వాస్తవాలేవి?

2 “యేడాత్మలు గలవాడు,” అని యేసు ఎందుకు తననుతాను పరిచయం చేసుకున్నాడు? ఎందుకంటే, యీ ఆత్మలు యెహోవానుండి సంపూర్ణంగా వచ్చే పరిశుద్ధాత్మను సూచిస్తున్నాయి. దేవుని పరిశుద్ధాత్మ యేసుకు అనుగ్రహించే సూక్ష్మ దృష్టిని తెలుపుతూ, యోహాను తదుపరి వాటిని “ఏడు కన్నులు” అనికూడ వర్ణిస్తున్నాడు. (ప్రకటన 5:6) అలా, ఆయన రాబోవు ఏ పరిస్థితినైనా ఎదుర్కొని పరిష్కరించ గలడు. (మత్తయి 10:26; 1 కొరింథీయులు 4:5) సార్దీస్‌ సంఘం ఆత్మీయంగా జీవించి, చురుకుగా వుండడంలో కీర్తి గడించిందే గాని ఆత్మీయంగా మృతమైయున్నట్లు యేసు చూడగల్గుతున్నాడు. స్పష్టంగా, దాని సభ్యుల్లో అనేకులు తాము క్రైస్తవులుకాక మునుపు వారికున్న నిర్లక్ష్యపు స్థితికి మరలా దిగజారి పోయారు.—ఎఫెసీయులు 2:1-3; హెబ్రీయులు 5:11-14 పోల్చండి.

3. (ఎ) “సార్దీస్‌లో ఉన్న సంఘపు దూత,” యేసు “ఏడు నక్షత్రాలు గలవాడు,” అనే సత్యాన్ని ఎందుకు ప్రత్యేకంగా గుర్తించాలి? (బి) సార్దీస్‌లోని సంఘానికి యేసు ఎటువంటి గట్టి హెచ్చరిక చేస్తున్నాడు?

3 యేసు “సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు,” “ఏడు నక్షత్రములు గలవాడు,’’ ఆయనేనని కూడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆ సంఘపెద్దలను తన కుడిచేతితో పట్టుకొని యున్నాడు, వారి కాపరి పనిలోవారిని నడిపించడానికి అధికారం కల్గివున్నాడు. వారు వారి ‘మందనుగూర్చి కచ్చితంగా తెలుసుకొనేలా’ వారి హృదయాలను కేంద్రీకృతం చేయాలి. (సామెతలు 27:23) గనుక, వారు యేసు తర్వాతి మాటల్ని వినడం మంచిది: “నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము. నీ వేలాగు ఉపదేశము పొందితివో, యేలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను. ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.”—ప్రకటన 3:2, 3.

4. పేతురు మాటలు, సార్దీస్‌లోని సంఘం “మిగిలినవాటిని బలపరచు”టకు ఎలా సహాయంచేస్తాయి?

4 సార్దీస్‌లోని పెద్దలు వారు మొదట సత్యం నేర్చుకున్నప్పుడు పొందిన ఆనందాన్ని, ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరముంది ఇప్పుడువారు ఆత్మీయక్రియ విషయంలో వారు మృతులే. విశ్వాసానికి తగిన క్రియలు లేనందువల్ల వారి దీపం మిణుకు మిణుకుమంటోంది. ఎన్నో సంవత్సరాల క్రితం, అపొస్తలుడైన పేతురు క్రైస్తవులు చేపట్టిన మహిమగల సువార్తయెడల మెప్పుదలను పెంచడానికి ఆసియాలోనున్న (సార్దీస్‌ కూడ ఉండవచ్చు) సంఘాలకు వ్రాశాడు, ఆ సువార్త, యోహాను దర్శనంలోని యేడాత్మలుగా సూచించబడిన—“పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మ,” వలన ప్రకటించబడిందే. పేతురు ఆ ఆసియా క్రైస్తవులకు వారు, “ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలకు,” సంబంధించిన వారని జ్ఞాపకం చేస్తున్నాడు. (1 పేతురు 1:12, 25; 2:9) ఆత్మీయ విషయాలను అలా జ్ఞాపకం చేసుకొనుట ద్వారా సార్దీస్‌ సంఘం మారుమనస్సు పొందడానికి, “మిగిలిన వాటిని బలపరచ”డానికి సహాయకరంగా వుంటుంది.—2 పేతురు 3:9.

5. (ఎ) సార్దీస్‌లోని క్రైస్తవుల మెప్పుదల కేమైంది? (బి) యేసు హెచ్చరికకు చెవియొగ్గకపోతే సార్దీస్‌ క్రైస్తవుల కేమౌతుంది?

5 ఇప్పుడైతే, సత్యంయెడల వారికున్న ప్రేమాభినందనలు దాదాపు ఆరిపోయిన అగ్నిలాగానేవున్నాయి. కొన్ని నిప్పురవ్వలు మాత్రం మిణుకు మిణుకుమంటున్నాయి. దాన్ని ఊది, అగ్నిని రాజబెట్టి, వారి నిర్లక్ష్యం వారిని నడిపించిన పాపంనుండి పశ్చాత్తాపపడి, మరల ఆత్మీయజీవం పోసుకున్న సంఘంలా తయారు కమ్మని యేసు వారిని ప్రోత్సహిస్తున్నాడు. (2 తిమోతి 1:6, 7 పోల్చండి.) లేకపోతే, యేసు ‘దొంగవలె” అనుకోని రీతిలో తీర్పుతీర్చడానికి వస్తే, సార్దీస్‌ సంఘం సిద్ధపడివుండదు.—మత్తయి 24:43, 44.

“దొంగవలె” వచ్చుట

6. యేసు 1918 లో ఎలా “దొంగవలె” వచ్చాడు, మరి ఆయన తన ననుసరిస్తున్నామని చెప్పుకున్నవారిలో ఎటువంటి పరిస్థితిని చూశాడు?

6 యేసు తాను “దొంగవలె” వస్తానన్నమాట ఆధునిక కాలంవరకు వర్తిస్తుంది. ప్రభువు దినములోనికి ప్రవేశించిన క్రైస్తవులకు అదొక ప్రత్యేక భావాన్ని కల్గివుంది. మరి 1914వ సంవత్సరం ముగిసిన వెంటనే మలాకీ ప్రవచనం నెరవేరడాని కారంభమైంది. “మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మలాకీ 3:1; ప్రకటన 1:10) “నిబంధన దూతగా,” యేసు తన అనుచరులని చెప్పుకున్న వారిని తనిఖీ చేయడానికి తీర్పుతీర్చడానికి వచ్చాడు. (1 పేతురు 4:17) అప్పుడు అంటే 1918 లో, క్రైస్తవమత సామ్రాజ్యం మొదటి ప్రపంచ యుద్ధంలో మునిగి రక్తాన్ని చిందిస్తూ, ఆత్మీయత విషయంలో పూర్తిగా చనిపోయివుంది. యుద్ధంకంటే ముందు ఎంతో ఆసక్తితో సువార్త ప్రకటించిన క్రైస్తవులు సహితం ఆత్మీయ నిద్రమత్తులో పడ్డారు. వారిలోని ప్రముఖ పెద్దలు జైల్లో వేయబడ్డారు, మరి సువార్త సేవ దాదాపు పూర్తిగా నిలిపివేయబడింది. మరుసటి సంవత్సరంలో యెహోవా ఆత్మ వారిని మేల్కొల్పినప్పుడు అందుకు అందరు సిద్ధంగాలేరు. యేసు చెప్పిన ఉపమానంలోని బుద్ధిలేని కన్యకలవలె, యెహోవాను సేవించే ఆధిక్యతకు ఆత్మీయంగా సిద్ధంగా లేకుండిరి. అయిననూ, సంతోషమేమంటే, “ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి,” అని యేసు యిచ్చిన హెచ్చరికను బుద్ధిగల కన్యకలవలె లక్ష్యపెట్టిన అనేకులున్నారు.—మత్తయి 25:1-13.

7. క్రైస్తవులీనాడు ఎందుకు మెలకువ కలిగుండాలి?

7 క్రైస్తవుడు మెలకువగావుండే అవసరత ప్రభువుదినము తొలిభాగంలోనే ముగియలేదు. “ఇవన్నియు నెరవేరబోవు కాలమునకు . . . గురుతు,”ను గూర్చిన గొప్ప ప్రవచనంలో, యేసు గట్టి హెచ్చరిక యిచ్చాడు: “ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు . . . ఏ మనుష్యుడైనను . . . ఎరుగరు. జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు.” (మార్కు 13:4, 32, 33, 37) అవును యీ గడియవరకు మనలో ప్రతిఒక్కరు, వారు అభిషక్తులైనా గొప్పసమూహం వారైనా మెలకువగా వుంటూ, ఆత్మీయ నిద్రమత్తులోకి పోకుండ పోరాడవలసిన అవసరముంది. యెహోవాదినము “రాత్రివేళ దొంగవలె” వస్తే మంచి తీర్పును పొందేంతటి మెలకువకల్గి ఉన్నట్లు కనబడదాము.—1 థెస్సలొనీకయులు 5:2, 3: లూకా 21:34-36: ప్రకటన 7:9.

8. దేవుని ప్రజలు ఆత్మీయంగా జీవిస్తూ వుండడానికి యోహాను తరగతి వారికెలా సహాయంచేస్తుంది?

8 యోహాను తరగతి యీనాడు, దేవుని ప్రజలు ఆత్మీయంగా మెలకువగలిగి ఉండడానికి వారిని పురికొల్పేందుకు వీరే మెలకువతో వున్నారు. ఇందుకే సంవత్సరం పొడవునా, ప్రపంచమంతట ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయబడు తున్నాయి. ఇటీవల ఓ సంవత్సరం, 1513 జిల్లా సమావేశాలకు 74,88,266 మంది హాజరయ్యారు, మరి 1,31,870 మంది కొత్త విశ్వాసులు బాప్తిస్మం పొందారు. వందకంటే ఎక్కువ సంవత్సరాల నుండి యోహాను తరగతి యెహోవా నామాన్ని సంకల్పాన్నిగూర్చి ప్రకటించడానికి వాచ్‌టవర్‌ నుపయోగించుకుంది. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగిన కాలంలో వచ్చిన గొప్ప హింసలకు సమాధానంగా, “బ్లెస్డ్‌ ఆర్‌ ది ఫియర్‌లెస్‌” (1919), “ఎ కాల్‌ టు యాక్షన్‌” (1925) మరియు “డిఫీట్‌ ఆఫ్‌ పర్‌సెక్యూషన్‌“ (1942) వంటి శీర్షికలను ప్రచురించడం మూలంగా ది వాచ్‌టవర్‌ యెహోవా సాక్షులను నూతనోత్సాహానికి పురికొల్పింది.

9. (ఎ) క్రైస్తవులంతా తమనుతాము ఏ ప్రశ్నలను వేసుకోవాలి? (బి) ది వాచ్‌టవర్‌ ఎటువంటి ప్రోత్సాహాన్నిచ్చింది?

9 సార్దీస్‌లోవలె, సంఘాల్లో యీనాడు క్రైస్తవులందరూ స్వయంపరీక్ష చేసుకోవడం అవశ్యం. మనందరం స్వయంగా యిలా ప్రశ్నించుకుంటూ వుండాలి. దేవుని యెదుట ‘మన క్రియలు సంపూర్ణంగా’ వున్నాయా? ఇతరులను విమర్శించకుండా, స్వయం త్యాగశీలతను స్వయంగా కలుగజేసుకుంటున్నామా, పూర్ణాత్మతో దేవున్ని సేవిస్తున్నామా? ఇందునిమిత్తమే, వాచ్‌టవర్‌ పత్రిక “ఆర్‌ యు సెల్ఫ్‌ఇండల్‌జెంట్‌—ఆర్‌ సెల్ఫ్‌ సాక్రిఫెసింగ్‌?” “ఎగ్జర్ట్‌ యువర్‌సెల్ఫ్‌ విగరస్లీ,” వంటి అంశాలను చర్చిస్తూ ప్రోత్సాహమిచ్చింది. * అటువంటి సహాయం ఉన్నందున, యెహోవా యెదుట యథార్థతతో వినయంగా, ప్రార్థనాపూర్వకంగా నడచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం మన ఆంతర్యాన్ని పరిశీలించుకుందాము.—కీర్తన 26:1-3; 139:23, 24.

“కొందరు”

10. సార్దీస్‌ సంఘంలో యేసు ఎటువంటి ప్రోత్సాహకరమైన విషయాన్ని గమనించాడు, ఇది మనపై ఎటువంటి ప్రభావం చూపించాలి?

10 సార్దీస్‌ సంఘానికి యేసు తర్వాత చెప్పిన మాటలు అత్యంత ప్రోత్సాహకరంగా వున్నాయి. ఆయనిలా చెబుతున్నాడు: “అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీస్‌లో నీయొద్ద ఉన్నారు. వార అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు. జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నా తండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.” (ప్రకటన 3:4, 5) ఈ మాటలు మనల్ని పురికొల్పి, నమ్మకంగా వుండాలనే మన తీర్మానాన్ని బలపరచడం లేదా? సంఘపెద్దల నిర్లక్ష్యంవల్ల, సంఘ మంతా ఆత్మీయ గాఢనిద్రావస్థలో వుండవచ్చు. అయినా, అందులో కొందరు వ్యక్తులు వారి క్రైస్తవ గుర్తింపును పవిత్రంగా ఉంచుకోవడానికి ధైర్యంగా పోరాడుతూండవచ్చు, అలా యెహోవాతో మంచి పేరును కల్గివుంటూనే ఉంటారు.—సామెతలు 22:1.

11, 12. (ఎ) గొప్ప మతభ్రష్టత జరిగిన కాలంలోకూడ కొందరెలా సార్దేస్‌లో నమ్మకంగావున్న “కొందరి”లాగే ఉండగలిగారు? (బి) ప్రభువు దినములో గోధుమలవంటి క్రైస్తవులకు ఎటువంటి ఉపశమనం దొరికింది?

11 అవును, “ఆ వస్త్రములు” ఒక క్రైస్తవుని నీతిప్రవర్తనను సూచిస్తున్నాయి. (ప్రకటన 16:15; 19:8 పోల్చండి.) అనేకులు అలసత్వాన్ని చూపిననూ, సార్దీస్‌లోని “కొందరు” అభిషక్త క్రైస్తవులు యీ గుర్తింపునింకా కల్గివున్నట్లు గమనించడం యేసుకు హృదయానందకరమే. అలాగే, మతభ్రష్టత్వం జరిగిన సుదీర్ఘకాలంలో, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోనులోనికి నామకార్థ క్రైస్తవులు చేర్చుకోబడినప్పుడు, గొప్ప అడ్డంకులున్ననూ యెహోవా చిత్తాన్ని చేయడానికి ప్రయత్నించే కొందరెల్లప్పుడూ తప్పక ఉండేవుంటారు. వీరు విస్తారంగావున్న విమతస్థులగు గురుగులమధ్య దాగిన నీతిగల గోధుమలై యుండిరి.—ప్రకటన 17:3-6; మత్తయి 13:24-29.

12 “యుగసమాప్తి వరకు సదాకాలము” యీ గురుగుల్లాంటి క్రైస్తవులతో ఉంటానని యేసు వాగ్దానం చేశాడు. వారెవరో తమకొరకు వారెలాంటి పేరు నార్జించుకున్నారో ఆయనకు తెలుసు. (మత్తయి 28:20; ప్రసంగి 7:1) ప్రభువు దినము ఆరంభమైనప్పుడు దీవిస్తున్న యీ నమ్మకమైన “కొందరు” పొందిన ఆనందాన్ని ఊహించండి! చివరకు వీరు ఆత్మీయంగా మరణించిన క్రైస్తవమత సామ్రాజ్యంనుండి వేరుచేయబడ్డారు, స్ముర్నలోని సంఘంవంటి నీతియుక్తమైన సంఘంగా సమకూర్చబడ్డారు.—మత్తయి 13:40-43.

13. “తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని,” అభిషక్త క్రైస్తవులకు ఏ ఆశీర్వాదాలు వేచియున్నాయి?

13 సార్దీస్‌లో అంతంవరకు నమ్మకంగా వున్నవారు, వారి క్రైస్తవ గుర్తింపును మలినం చేయనివారు అద్భుత నిరీక్షణను పొందుతున్నారు. యేసు యొక్క మెస్సీయ రాజ్యం 1914 లో స్థాపించబడిన తర్వాత, వారు ఆత్మీయజీవానికి పునరుత్థానం చేయబడుతున్నారు, జయించువారిగా వారి నీతిక్రియలకు, మచ్చలేని నీతికి గుర్తుగా వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. జీవానికి నడిపే యిరుకు మార్గంలో నడిచినందుకై వారు నిత్యజీవ వరాన్ని పొందుతారు.—మత్తయి 7:14; ప్రకటన 6:9-11 కూడా చూడండి.

జీవగ్రంథంలో నిత్యముండుట

14. “జీవగ్రంథమంటే ఏమిటి,” ఎవరి పేర్లు అందులో వ్రాయబడతాయి?

14 “జీవగ్రంథం”అంటే ఏమిటి, అందులో ఎవరి పేర్లుంటాయి? జీవగ్రంథం లేక గ్రంథపుచుట్ట అనేది, నిత్యజీవపు వరుసలోనికి వచ్చిన యెహోవా సేవకుల చరిత్రను సూచిస్తుంది. (మలాకీ 3:16) ఇక్కడ ప్రకటనలో అభిషక్త క్రైస్తవులపేర్లనుగూర్చి ప్రత్యేకంగా సూచించబడింది. అయితే భూమ్మీద నిత్యజీవం పొందబోయేవారి పేర్లుకూడ అందులో వున్నాయి. అంతేగాక, ఆ గ్రంథంలోనుండి పేర్లను ‘తుడిచివేయవచ్చు.’ (నిర్గమకాండము 32:32, 33) అయిననూ, వారి మరణం వరకు ఆ జీవగ్రంథంలో తమ పేర్లు కలిగియున్న యోహాను తరగతివారు, పరలోకమందు అమర్త్యమైన జీవాన్ని పొందుతారు. (ప్రకటన 2:10) యేసు ప్రత్యేకంగా వీరిపేర్లనే తన తండ్రియెదుట, దూతలయెదుట ఒప్పుకుంటాడు. అదెంతటి దివ్యమైన బహుమానమో కదా!

15. గొప్పసమూహంలోని సభ్యులు ఎలా తమ పేర్లను జీవగ్రంథంలో చిరస్థాయిగా నిలిచేలా చేసుకోగలరు?

15 జీవగ్రంథంలో ఎవరి పేర్లుకూడ వ్రాయబడినవో ఆ గొప్ప సమూహము మహాశ్రమలనుండి బ్రతికి బయటపడుతుంది. యేసు వెయ్యేండ్ల పాలనంతటిలోను, ఆ తర్వాతవచ్చే తీర్మానపూర్వకమైన పరీక్షాకాలంలోను నమ్మకత్వాన్ని కనబరచడంద్వారా, వీరు భూపరదైసులో నిత్యజీవ వరాన్ని పొందుతారు. (దానియేలు 12:1; ప్రకటన 7:9, 14; 20:15; 21:4) అప్పుడా గ్రంథంలో వారిపేర్లు చిరస్థాయిగా నిలుస్తాయి. పరిశుద్ధాత్మ ద్వారా యిక్కడ యివ్వబడిన విషయం తెలుసుకున్న మీరు యేసు పునరుద్ఘాటించిన ఉపదేశానికి ఉత్తేజంగా స్పందించరా? “సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినును గాక.”—ప్రకటన 3:6.

[అధస్సూచీలు]

^ పేరా 9 ఆగష్టు 1, 1978, మరియు జనవరి 15, 1986 వాచ్‌టవర్‌ చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]

[57వ పేజీలోని చిత్రం]

మీ పేరును జీవగ్రంథంలో నిలిచి ఉండుగాక