కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

సమ్సోను తాను చంపిన వారి మృతదేహాలను ముట్టిన తరువాత కూడా నాజీరుగా ఎలా ఉండగలిగాడు?

ప్రాచీన ఇశ్రాయేలులో, ఒక వ్యక్తి స్వచ్ఛందంగా మ్రొక్కుబడి చేసుకొని కొంతకాలం వరకు నాజీరుగా ఉండవచ్చు. * ఈ మ్రొక్కుబడికి బద్ధుడైన వ్యక్తి కట్టుబడి ఉండాల్సిన నియమాల్లో ఒకటి: “అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. . . . అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరి గాని చనిపోయినను వారినిబట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు.” ఒకవేళ ఎవరైనా ‘అతనియొద్ద హఠాత్తుగా చనిపోతే’ అప్పుడెలా? అలా ఆకస్మికంగా మృతదేహాన్ని ముట్టడం, ఆయన నాజీరుగా ఉండే స్థితిని మలినపరుస్తుంది. అందుకే, ఇలా పేర్కొనబడింది: “మునుపటి దినములు వ్యర్థమైనవి.” ఆయన శుద్ధీకరణ ఆచరణను ముగించుకొని నాజీరుగా ఉండే కాలాన్ని తిరిగి ప్రారంభించాలి.​—⁠సంఖ్యాకాండము 6:6-12.

అయితే, సమ్సోను మరో భావంలో నాజీరు. సమ్సోను పుట్టక ముందు యెహోవా దూత ఆయన తల్లితో ఇలా అన్నాడు: “నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టును.” (న్యాయాధిపతులు 13:⁠5) సమ్సోను నాజీరుగా ఉంటానని ఎలాంటి మ్రొక్కుబడి చేసుకోలేదు. దేవుడే ఆయనను నాజీరుగా నియమించాడు, ఆయన జీవితమంతా నాజీరుగానే ఉండాలి. మృత కళేబరం ముట్టకూడదనే నియమం ఆయన విషయంలో వర్తించదు. ఒకవేళ ఆయనకు వర్తించేదైతే, ఆయన అనుకోకుండా ఒక మృతదేహాన్ని ముట్టినట్లయితే తన పుట్టుకతో మొదలైన నాజీరు జీవితాన్ని తిరిగి ప్రారంభించడం ఆయనకెలా సాధ్యమవుతుంది? కాబట్టి, జీవితాంతం నాజీరులుగా ఉండే వారినుండి కోరబడేవి, స్వచ్ఛందంగా నాజీరులైన వారినుండి కోరబడేవి కొన్ని విధాలుగా వేరుగా ఉంటాయని స్పష్టమవుతోంది.

జీవితాంతం నాజీరులుగా ఉన్న సమ్సోను, సమూయేలు, బాప్తిస్మం ఇచ్చే యోహానులకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను బైబిలులో పరిశీలించండి. ముందు గమనించినట్లు, సమ్సోను తన తలవెంట్రుకలు కత్తిరించుకోకూడదు. హన్నా తనకు పుట్టబోయే కుమారుని గురించి, అంటే సమూయేలు గురించి ఇలా మ్రొక్కుబడి చేసుకుంది: “వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినము లన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతును.” (1 సమూయేలు 1:​11) బాప్తిస్మం ఇచ్చే యోహాను విషయంలో యెహోవా దూత ఇలా చెప్పాడు: ‘ఆయన ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగకూడదు.’ (లూకా 1:​14) అంతేకాకుండా, “యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము.” (మత్తయి 3:⁠4) ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ కూడా మృతదేహం దగ్గరకు వెళ్ళకూడదని ఆజ్ఞాపించబడలేదు.

సమ్సోను నాజీరైనప్పటికీ, దోచుకొనేవారి చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించేందుకు యెహోవా పుట్టించిన న్యాయాధిపతులలో ఆయన ఒకడు. (న్యాయాధిపతులు 2:​16) ఆ నియామకాన్ని నిర్వర్తించడంలో ఆయన మృతదేహాలను ముట్టుకొనేవాడు. ఒక సందర్భంలో సమ్సోను ముప్పది మంది ఫిలిష్తీయులను చంపి వారి బట్టలను తీసివేశాడు. తర్వాత ఆయన శత్రువుల మీద దాడి చేసి, “తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతముచేసెను.” అంతేగాక, ఆయన గాడిద పచ్చి దవడ యెముకను తీసుకొని దానితో వెయ్యి మందిని చంపాడు. (న్యాయాధిపతులు 14:19; 15:​8, 15) సమ్సోను దీనినంతటిని యెహోవా అనుగ్రహంతో, మద్దతుతో చేశాడు. లేఖనాలు ఆయనను మాదిరికరమైన విశ్వాసంగల వ్యక్తిగా పేర్కొంటున్నాయి.​—⁠హెబ్రీయులు 11:​32; 12:⁠1.

సమ్సోను “మేకపిల్లను చీల్చునట్లు” సింహాన్ని చీల్చాడు అనే వాక్యం, ఆయన రోజుల్లో మేకపిల్లలను చీల్చడం వాడుక అని సూచిస్తోందా?

ఇశ్రాయేలు న్యాయాధిపతుల కాలంలో సాధారణంగా ప్రజలు మేకపిల్లలను చీల్చేవారని రుజువు చేసే ఏ నిదర్శనమూ లేదు. న్యాయాధిపతులు 14:6లో ఇలా ఉంది: “యెహోవా ఆత్మ అతనిని [సమ్సోనును] ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని [ఒక కొదమ సింహాన్ని] చీల్చెను.” ఈ వ్యాఖ్యానం బహుశా ఒక దృష్టాంతం అయ్యుండవచ్చు.

“అతడు దానిని చీల్చెను” అనే వాక్యానికి రెండు అర్థాలు ఉండవచ్చు. సమ్సోను సింహం దవడలనైనా చీల్చివుండవచ్చు లేదా ఏదో ఒక విధంగా సింహం శరీర భాగాలను వేరుచేసివుండవచ్చు. ఒకవేళ పైనున్న పదబంధానికి సింహం దవడలను చీల్చడమనే భావమున్నట్లయితే, అదే విధంగా మేకపిల్లను చీల్చడం మానవశక్తికి సాధ్యమయ్యే విషయమే. ఆ సందర్భంలోనైతే, సింహాన్ని వట్టి చేతులతో జయించడం సమ్సోనుకు మేకపిల్లను వట్టి చేతులతో జయించడమంత సులభమని ఆ పోలిక దృష్టాంతపరుస్తోంది. ఒకవేళ సమ్సోను సింహం శరీరభాగాలను వేరు చేయడం ద్వారా దానిని చంపినట్లయితే అప్పుడేమిటి? ఆ వ్యాఖ్యానాన్ని ఉపమాలంకారంగా అర్థం చేసుకోవాలి. ఉపమాలంకార సారం ఏమిటంటే అసాధారణ శక్తి అవసరమైన పనిని చేయడానికి యెహోవా ఆత్మ సమ్సోనుకు శక్తినిచ్చింది. రెండు సందర్భాలలో కూడా, న్యాయాధిపతులు 14:6లో ఇవ్వబడిన పోలిక, ఒక సామాన్య వ్యక్తికి మేకపిల్ల ఎలాగైతే భయం కలిగించదో అలాగే యెహోవా సహాయంతో, శక్తిమంతమైన సింహం కూడా సమ్సోనుకు మేకపిల్లలాగే అనిపించిదని దృష్టాంతపరుస్తోంది.

[అధస్సూచి]

^ పేరా 3 మ్రొక్కుబడి చేసుకొనే వ్యక్తి నాజీరుగా ఎంతకాలం ఉండాలనే నిర్ణయం స్వయంగా తీసుకుంటాడు. అయితే, యూదా ఆచారం ప్రకారం మ్రొక్కుబడికి కనీస సమయం 30 రోజులు. దానికంటే తక్కువ రోజులు మ్రొక్కుబడి చేసుకున్నట్లయితే అది మ్రొక్కుబడిని మామూలు విషయంగా మార్చేస్తుందని వారు భావించేవారు.