కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8వ కథ

భూమిపై రాక్షసులు

భూమిపై రాక్షసులు

ఎవరో ఒక వ్యక్తి మీ వైపు నడిచి వస్తున్నాడు అనుకోండి. అతను మీ ఇంటి పైకప్పును తాకేంత ఎత్తుగా ఉంటే, మీరు ఏమనుకుంటారు? ఆ వ్యక్తి రాక్షసుడై ఉండాలి! ఒకప్పుడు భూమిపై నిజంగానే రాక్షసులుండేవారు. వాళ్ళ తండ్రులు పరలోకంనుండి వచ్చిన దేవదూతలని బైబిలు చెబుతోంది. అదెలా సాధ్యం?

గుర్తు తెచ్చుకోండి, చెడ్డ దూత సాతాను కష్టాలను కలిగించడానికి చాలా చురుకుగా పనిచేస్తున్నాడని మనం తెలుసుకున్నాము. అతను దేవుని దూతలను కూడా చెడ్డవారిగా చెయ్యాలని ప్రయత్నించేవాడు. చివరకు కొంతమంది దేవదూతలు అతని మాట వినడం మొదలుపెట్టారు. వాళ్ళు పరలోకంలో దేవుడు తమకు నియమించిన పనిని చేయడం మానుకున్నారు. వాళ్ళు భూమ్మీదకు వచ్చి తమ కోసం మానవ శరీరాలను చేసుకున్నారు. ఎందుకో తెలుసా?

దేవుని కుమారులైన ఆ దూతలు భూమిపైవున్న అందమైన స్త్రీలను చూసి వాళ్ళతో జీవించాలని కోరుకున్నారు అని బైబిలు చెబుతోంది. కాబట్టి వాళ్ళు భూమ్మీదికి వచ్చి ఆ స్త్రీలను వివాహం చేసుకున్నారు. అలా చేయడం తప్పని బైబిలు చెబుతోంది, ఎందుకంటే దేవుడు దేవదూతలను పరలోకంలో జీవించడానికే చేశాడు.

దేవదూతలకు వాళ్ళ భార్యలకు పిల్లలు పుట్టినప్పుడు, ఆ పిల్లలు భిన్నంగా ఉన్నారు. బహుశా వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు అంత భిన్నంగా కనిపించివుండరు. కానీ వాళ్ళు అలా, రాను రాను ఎత్తుగా, బలంగా రాక్షసులుగా పెరిగిపోయారు.

ఆ రాక్షసులు చెడ్డవారు. వాళ్ళు ఎత్తుగా, బలంగా ఉండేవాళ్ళు కాబట్టి ఇతరులను బాధపెట్టేవారు. వాళ్ళు తమలాగే ఇతరులు కూడా చెడ్డగా ప్రవర్తించేలా చేయడానికి ప్రయత్నించేవారు.

హనోకు మరణించాడు, కానీ భూమిపై మరో మంచి వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు నోవహు. ఆయన ఎప్పుడూ దేవుడు చేయమన్న దానినే చేసేవాడు.

ఒకరోజు నోవహుతో దేవుడు, తాను చెడ్డ వాళ్ళనందరిని నాశనం చేసే సమయం వచ్చిందని చెప్పాడు. అయితే దేవుడు నోవహును, ఆయన కుటుంబాన్ని, అనేక జంతువులను మాత్రం రక్షించాడు. దానిని దేవుడెలా చేశాడో చూద్దాం.