దినవృత్తాంతాలు రెండో గ్రంథం 35:1-27

  • యోషీయా పస్కాను ఘనంగా ఏర్పాటు చేయడం (1-19)

  • యోషీయాను ఫరో నెకో చంపడం (20-27)

35  యోషీయా యెరూషలేములో యెహోవాకు పస్కా+ ఏర్పాటు చేశాడు, వాళ్లు మొదటి నెల 14వ రోజున+ పస్కా బలి జంతువును వధించారు.+ 2  అతను యాజకుల్ని వాళ్లవాళ్ల పనుల్లో నియమించి, యెహోవా మందిరంలో తమకు నియమించబడిన సేవను చేయమని వాళ్లను ప్రోత్సహించాడు.+ 3  తర్వాత అతను, యెహోవాకు ప్రతిష్ఠించబడి ఇశ్రాయేలీయులందరికీ ఉపదేశకులుగా ఉన్న లేవీయులకు+ ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన మందిరంలో పవిత్ర మందసాన్ని పెట్టండి;+ ఇకమీదట మీరు దాన్ని మీ భుజాల మీద మోయకూడదు.+ మీరు మీ దేవుడైన యెహోవాకు, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులకు సేవచేయండి. 4  ఇశ్రాయేలు రాజైన దావీదు, అతని కుమారుడు సొలొమోను రాసి ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా, మీ మీ విభాగాల ప్రకారం మీ పూర్వీకుల కుటుంబాలవారీగా సిద్ధమవ్వండి.+ 5  మీ సహోదరులైన ప్రజల పూర్వీకుల కుటుంబాలవారీగా మీరు పవిత్ర స్థలంలో నిలబడండి. అక్కడున్న ప్రతీ పూర్వీకుల కుటుంబానికి ఒక లేవీయుల కుటుంబం సేవచేయాలి. 6  మీరు పస్కా బలి జంతువును వధించి,+ మిమ్మల్ని మీరు పవిత్రపర్చుకుని, మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞను పాటించేలా మీ సహోదరుల కోసం ఏర్పాట్లు చేయండి.” 7  అక్కడికి వచ్చిన ప్రజలందరూ పస్కా బలి జంతువుల్ని అర్పించడం కోసం యోషీయా రాజు తన సొంత మందలో నుండి 30,000 మగ గొర్రెపిల్లల్ని, మగ మేకపిల్లల్ని, అలాగే 3,000 పశువుల్ని విరాళంగా ఇచ్చాడు.+ 8  అతని అధిపతులు కూడా ప్రజల కోసం, యాజకుల కోసం, లేవీయుల కోసం స్వేచ్ఛార్పణగా విరాళం ఇచ్చారు. సత్యదేవుని మందిర నాయకులైన హిల్కీయా,+ జెకర్యా, యెహీయేలు యాజకులకు 2,600 పస్కా బలి జంతువుల్ని, 300 పశువుల్ని విరాళంగా ఇచ్చారు. 9  కొనన్యా, అతని సహోదరులైన షెమయా, నెతనేలుతోపాటు లేవీయుల అధిపతులైన హషబ్యా, యెహీయేలు, యోజాబాదు లేవీయులకు 5,000 పస్కా బలి జంతువుల్ని, 500 పశువుల్ని ఇచ్చారు. 10  పండుగ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజు ఆజ్ఞాపించినట్టు యాజకులు తమ స్థానాల్లో, లేవీయులు తమ విభాగాల ప్రకారం+ నిలబడ్డారు. 11  వాళ్లు పస్కా బలి జంతువుల్ని వధించారు;+ వాళ్లు ఇచ్చిన రక్తాన్ని యాజకులు బలిపీఠం మీద చిలకరించారు,+ ఆ సమయంలో లేవీయులు ఆ జంతువుల చర్మాన్ని ఒలుస్తున్నారు.+ 12  ఆ తర్వాత పూర్వీకుల కుటుంబాల ప్రకారం ఉన్న ప్రజలకు పంచిపెట్టడానికి దహనబలుల్ని సిద్ధం చేశారు. మోషే గ్రంథంలో రాయబడినదాని ప్రకారం వాటిని యెహోవాకు అర్పించడానికి అలా చేశారు. పశువుల విషయంలో కూడా వాళ్లు అలాగే చేశారు. 13  ఆచారం ప్రకారం వాళ్లు పస్కా బలి జంతువును నిప్పుల మీద వండారు;*+ వాళ్లు పవిత్రమైన అర్పణల్ని పాత్రల్లో, పెద్ద గిన్నెల్లో, పెనాల మీద వండి వాటిని త్వరత్వరగా ప్రజలందరి దగ్గరికి తీసుకొచ్చారు. 14  తర్వాత లేవీయులు తమ కోసం, యాజకుల కోసం పస్కా భోజనం సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే అహరోను వంశస్థులైన యాజకులు రాత్రివరకు దహనబలుల్ని, కొవ్వును అర్పిస్తూ ఉన్నారు. అలా లేవీయులు తమ కోసం, అహరోను వంశస్థులైన యాజకుల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. 15  దావీదు,+ ఆసాపు,+ హేమాను, అలాగే రాజు కోసం దర్శనాలు చూసే యెదూతూను+ ఆజ్ఞాపించినదాని ప్రకారం గాయకులైన ఆసాపు కుమారులు+ తమ స్థానాల్లో ఉన్నారు; ద్వారపాలకులు ఆయా ద్వారాల దగ్గర ఉన్నారు.+ వాళ్ల కోసం వాళ్ల సహోదరులైన లేవీయులు పస్కా భోజనాన్ని సిద్ధం చేశారు కాబట్టి వాళ్లు తమ సేవను విడిచి వెళ్లాల్సిన అవసరం రాలేదు. 16  ఆ రోజు పస్కాను ఆచరించడానికి,+ యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించడానికి సంబంధించి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ సిద్ధం చేశారు. యోషీయా రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వాటిని చేశారు.+ 17  అప్పుడు అక్కడున్న ఇశ్రాయేలీయులు పస్కాను ఆచరించారు, వాళ్లు ఏడురోజుల పాటు పులవని రొట్టెల పండుగను ఆచరించారు.+ 18  సమూయేలు ప్రవక్త రోజుల నుండి ఇశ్రాయేలులో అలాంటి పస్కా ఎప్పుడూ ఆచరించబడలేదు; యోషీయా, యాజకులు, లేవీయులు, అక్కడున్న యూదా, ఇశ్రాయేలు వాళ్లందరూ, యెరూషలేము నివాసులు ఆచరించిన ఆ పస్కా లాంటి పస్కాను వేరే ఏ ఇశ్రాయేలు రాజూ ఆచరించలేదు.+ 19  యోషీయా పరిపాలనలోని 18వ సంవత్సరంలో ఆ పస్కాను ఆచరించారు. 20  ఇదంతా జరిగి, యోషీయా ఆలయాన్ని సిద్ధం చేసిన తర్వాత, ఐగుప్తు రాజైన నెకో+ యూఫ్రటీసు నది దగ్గర ఉన్న కర్కెమీషు వద్ద యుద్ధం చేయడానికి వచ్చాడు. అప్పుడు యోషీయా అతని మీదికి వెళ్లాడు.+ 21  అప్పుడు నెకో తన సందేశకులతో యోషీయాకు ఈ కబురు పంపించాడు: “యూదా రాజా, దీనితో నీకేం సంబంధం? ఈ రోజు నేను నీ మీదికి రాలేదు, నేను వేరే దేశం మీద పోరాటం చేస్తున్నాను, దేవుడు నన్ను త్వరపడమని చెప్తున్నాడు. నాకు తోడుగా ఉన్న దేవుణ్ణి వ్యతిరేకించకు, అదే నీకు మంచిది. లేకపోతే ఆయన నిన్ను నాశనం చేస్తాడు.” 22  అయితే, యోషీయా అతని దగ్గర నుండి వెళ్లిపోకుండా ఐగుప్తు రాజుతో యుద్ధం చేయడానికి మారువేషం వేసుకొని వెళ్లాడు.+ దేవుని నోటి మాటగా నెకో చెప్పిన మాటను వినకుండా, అతను మెగిద్దో మైదానంలో+ యుద్ధం చేయడానికి వచ్చాడు. 23  విలుకాండ్రు యోషీయా రాజు మీద బాణాలు వేశారు. అప్పుడు రాజు తన సేవకులతో, “నేను తీవ్రంగా గాయపడ్డాను, నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లండి” అని చెప్పాడు. 24  దాంతో అతని సేవకులు అతన్ని రథం మీద నుండి దించి, అతని రెండో యుద్ధ రథం మీద అతన్ని ఉంచి యెరూషలేముకు తీసుకొచ్చారు. అతను చనిపోయాడు, అతన్ని తన పూర్వీకుల సమాధిలో పాతిపెట్టారు;+ యోషీయా చనిపోయినందుకు యూదా, యెరూషలేము వాళ్లందరూ దుఃఖించారు. 25  యిర్మీయా+ యోషీయా గురించి శోకగీతాలు పాడాడు; ఈ రోజు వరకు గాయకులు, గాయకురాళ్లు+ అందరూ తమ శోకగీతాల్లో యోషీయా గురించి పాడతారు; వాటిని పాడడం అనేది ఇశ్రాయేలులో ఒక ఆచారం* అయింది, అవి శోకగీతాల పుస్తకంలో రాయబడివున్నాయి. 26  యోషీయా మిగతా చరిత్ర, అంటే యెహోవా ధర్మశాస్త్రంలో రాయబడినవాటిని పాటించే విషయంలో అతను విశ్వసనీయ ప్రేమతో చేసిన పనుల గురించి, 27  అతను మొదటి నుండి చివరి వరకు చేసిన పనుల గురించి ఇశ్రాయేలు, యూదా రాజుల గ్రంథంలో రాయబడివుంది.+

అధస్సూచీలు

లేదా “కాల్చారు” అయ్యుంటుంది.
లేదా “నియమం.”