యెషయా 4:1-6

  • ఏడుగురు స్త్రీలకు ఒక్క పురుషుడు (1)

  • యెహోవా మొలిపించేవాటి మహిమ గొప్పగా ఉంటుంది (2-6)

4  ఆ రోజు ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకొని,+ “మేము మా ఆహారమే తింటాం,మా సొంత బట్టలే వేసుకుంటాం;మా అవమానాన్ని* తీసేసుకోవడానికి+మమ్మల్ని నీ పేరుతో పిలవబడనివ్వు చాలు” అని అంటారు. 2  ఆ రోజు యెహోవా మొలిపించేవాటి వైభవం, మహిమ గొప్పగా ఉంటుంది; దేశంలోని పంట, ప్రాణాలతో తప్పించుకున్న ఇశ్రాయేలు ప్రజలకు గర్వకారణంగా, అలంకారంగా ఉంటుంది.+ 3  సీయోనులో శేషించినవాళ్లు, యెరూషలేములో మిగిలినవాళ్లు, అంటే యెరూషలేములో జీవించేలా పేర్లు రాయబడిన వాళ్లందరు+ పవిత్రులని పిలవబడతారు. 4  యెహోవా యెరూషలేము మీద తన ఉగ్రతను చూపించి,+ ఆమెకు తీర్పు తీర్చి, సీయోను కూతుళ్ల మలినాన్ని* కడిగేసినప్పుడు,+ యెరూషలేములో నుండి రక్తపాతాన్ని తీసేసినప్పుడు, 5  యెహోవా సీయోను పర్వతమంతటి మీద, ఆమె సమావేశ ప్రాంతమంతటి మీద పగలు మేఘాన్ని, పొగను, రాత్రి తేజోవంతంగా మండే అగ్నిని కలగజేస్తాడు.+ మహిమగల దేశమంతటి మీద సంరక్షించే కప్పు ఉంటుంది. 6  పగలు ఎండకు నీడగా,+ గాలివానలు వచ్చినప్పుడు ఆశ్రయంగా+ ఒక పందిరి ఉంటుంది.

అధస్సూచీలు

అంటే, పెళ్లి కాలేదనే, పిల్లలు లేరనే అవమానం.
అక్ష., “మలాన్ని.”