మార్కు సువార్త 16:1-8

  • యేసు పునరుత్థానం అవ్వడం (1-8)

16  విశ్రాంతి రోజు ముగిశాక మగ్దలేనే మరియ, యాకోబువాళ్ల అమ్మ మరియ,+ సలోమే యేసు సమాధి దగ్గరికి వెళ్లి ఆయన శరీరానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు.+ 2  వారం మొదటి రోజు* పొద్దుపొద్దున సూర్యుడు ఉదయించగానే వాళ్లు సమాధి* దగ్గరికి వచ్చారు.+ 3  వాళ్లు, “మనకోసం సమాధి రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. 4  కానీ వాళ్లు చూసేసరికి, ఆ పెద్ద రాయి అప్పటికే పక్కకు దొర్లించి ఉంది.+ 5  వాళ్లు సమాధి లోపలికి వెళ్లారు; అక్కడ తెల్ల బట్టలు వేసుకున్న ఒక యువకుడు కుడివైపున కూర్చొని ఉండడం చూసి అవాక్కయ్యారు. 6  అతను వాళ్లతో ఇలా అన్నాడు: “ఆశ్చర్యపోకండి.+ మీరు కొయ్యపై మరణశిక్ష వేయబడిన నజరేయుడైన యేసు కోసం చూస్తున్నారని నాకు తెలుసు. ఆయన బ్రతికించబడ్డాడు,+ ఇక్కడ లేడు. ఇదిగో, ఇదే ఆయన్ని ఉంచిన చోటు.+ 7  అయితే మీరు వెళ్లి ఆయన శిష్యులకు, పేతురుకు ఇలా చెప్పండి: ‘ఆయన మీకన్నా ముందు గలిలయకు వెళ్తున్నాడు.+ ఆయన మీకు చెప్పినట్టే అక్కడ మీరు ఆయన్ని చూస్తారు.’ ”+ 8  వాళ్లు బయటికి వచ్చాక, భయంతో వణికిపోతూ ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరౌతూ సమాధి దగ్గర నుండి పారిపోయారు. వాళ్లు చాలా భయపడిపోవడం వల్ల ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు.*+

అధస్సూచీలు

మత్తయి 28:1 అధస్సూచి చూడండి.
లేదా “స్మారక సమాధి.”
నమ్మదగిన తొలి రాతప్రతుల ప్రకారం, 8వ వచనంలోని మాటలతో మార్కు సువార్త ముగుస్తుంది. అనుబంధం A3 చూడండి.