నిర్గమకాండం 9:1-35
9 కాబట్టి యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు: ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, “నా ప్రజలు నన్ను సేవించేలా వాళ్లను పంపించేయి.+
2 కానీ నువ్వు వాళ్లను పంపించకుండా ఇలా నీ దగ్గరే ఉంచుకుంటే,
3 ఇదిగో! యెహోవా చెయ్యి+ పొలంలో ఉన్న నీ పశువులన్నిటి మీదికి వస్తుంది. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, పశువులు, మందలు అన్నిటికీ భయంకరమైన వ్యాధి వస్తుంది.+
4 యెహోవా తప్పకుండా ఇశ్రాయేలు పశువులకు, ఐగుప్తు పశువులకు మధ్య తేడా చూపిస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందినదేదీ చనిపోదు.” ’ ”+
5 అంతేకాదు యెహోవా దానికి ఒక సమయాన్ని నియమించి, “రేపు యెహోవా ఈ దేశంలో దాన్ని చేస్తాడు” అని అన్నాడు.
6 యెహోవా తర్వాతి రోజే దాన్ని చేశాడు, దాంతో ఐగుప్తులోని అన్నిరకాల పశువులు చనిపోసాగాయి.+ అయితే ఇశ్రాయేలీయుల పశువుల్లో ఒక్కటి కూడా చనిపోలేదు.
7 ఫరో దాని గురించి వాకబు చేసినప్పుడు, ఇదిగో! ఇశ్రాయేలీయుల పశువుల్లో ఒక్కటి కూడా చనిపోలేదు. అయినా, ఫరో హృదయం ఎప్పటిలాగే మొద్దుబారిపోయి ఉంది, అతను ఆ ప్రజల్ని పంపించలేదు.+
8 తర్వాత యెహోవా మోషే, అహరోనులతో ఇలా అన్నాడు: “మీరు రెండు చేతుల నిండా కొలిమిలోని బూడిదను తీసుకోండి. మోషే దాన్ని ఫరో ముందు గాల్లోకి చల్లాలి.
9 అది ఐగుప్తు దేశమంతటా సన్నని ధూళి అవుతుంది; అది ఐగుప్తు దేశమంతటా మనుషుల మీద, జంతువుల మీద చీముపొక్కులు అవుతుంది.”
10 కాబట్టి వాళ్లు కొలిమిలోని బూడిద తీసుకొని ఫరో ముందు నిలబడ్డారు. మోషే దాన్ని గాల్లోకి చల్లాడు. అప్పుడది మనుషుల మీద, జంతువుల మీద చీముపొక్కులు అయింది.
11 ఆ పొక్కులు ఇంద్రజాలం చేసే పూజారుల ఒంటిమీద, ఐగుప్తీయులందరి ఒంటిమీద వచ్చాయి కాబట్టి, వాటి కారణంగా వాళ్లు మోషే ముందు నిలబడలేకపోయారు.+
12 అయితే యెహోవా మోషేకు ముందే చెప్పినట్టు, యెహోవా ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిచ్చాడు, ఫరో వాళ్ల మాట వినలేదు.+
13 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “నువ్వు తెల్లవారుజామునే లేచి, ఫరో ముందు నిలబడి అతనితో ఇలా అను: ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్పాడు: “నా ప్రజలు నన్ను సేవించేలా వాళ్లను పంపించేయి.
14 ఇప్పుడు నేను తెగుళ్లన్నిటినీ నీ హృదయం మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి గురిపెడుతున్నాను. అప్పుడు నువ్వు భూమంతట్లో నాలాంటి వాళ్లు ఎవ్వరూ లేరని తెలుసుకుంటావు.+
15 ఇప్పటికల్లా నేను నా చెయ్యి చాపి నీ మీదికి, నీ ప్రజల మీదికి భయంకరమైన తెగులు రప్పించి భూమ్మీద లేకుండా నిన్ను తుడిచిపెట్టి ఉండేవాణ్ణి.
16 అయితే నీకు నా బలాన్ని చూపించాలి, భూమంతటా నా పేరు ప్రకటించబడాలి అనే ఒక్క కారణంతోనే నిన్ను ఇంకా ప్రాణాలతో ఉండనిచ్చాను.+
17 నువ్వు నా ప్రజల్ని పంపించకుండా వాళ్ల విషయంలో ఇప్పటికీ అహంకారం చూపిస్తున్నావా?
18 ఇదిగో, రేపు దాదాపు ఈ సమయానికి నేను పెద్దపెద్ద వడగండ్ల వాన కురిపిస్తాను, ఐగుప్తు దేశం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఎప్పుడూ అలాంటిది రాలేదు.
19 కాబట్టి, పొలాల్లో ఉన్న నీ పశువుల్ని, అక్కడ నీకు ఉన్న వాటన్నిటినీ సురక్షితమైన చోటికి తెమ్మని కబురు పంపు. వడగండ్ల వాన వచ్చినప్పుడు, పొలంలో చిక్కుకుపోయి ఇంటికి తీసుకురాబడని ప్రతీ మనిషి చనిపోతాడు, ప్రతీ జంతువు చచ్చిపోతుంది.” ’ ”
20 ఫరో సేవకుల్లో యెహోవా మాటకు భయపడిన ప్రతీ ఒక్కరు వెంటనే తమ సేవకుల్ని, తమ పశువుల్ని ఇళ్లకు తెచ్చుకున్నారు.
21 ఎవరైతే యెహోవా మాటను పట్టించుకోలేదో వాళ్లు తమ సేవకుల్ని, పశువుల్ని పొలంలోనే వదిలేశారు.
22 అప్పుడు యెహోవా మోషేతో, “ఐగుప్తు దేశమంతటి మీదికి, అంటే దానిలోని మనుషుల మీదికి, జంతువుల మీదికి, పొలంలో ఉన్న మొక్కలన్నిటి మీదికి+ వడగండ్ల వాన వచ్చేలా+ నీ చెయ్యి ఆకాశం వైపు చాపు” అన్నాడు.
23 దాంతో మోషే తన కర్రను ఆకాశం వైపు చాపాడు. అప్పుడు యెహోవా ఉరుముల్ని, వడగండ్ల వానను రప్పించాడు; భూమ్మీద అగ్ని* కురిసింది. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్ల వాన కురిపిస్తూ ఉన్నాడు.
24 వడగండ్ల వాన కురిసింది, దానితో పాటు మధ్యమధ్యలో మెరుపులు కనిపించాయి. అది ఎంత పెద్ద వడగండ్ల వాన అంటే, ఐగుప్తు ఒక జనంగా ఏర్పడినప్పటి నుండి ఎన్నడూ అలాంటిది కురవలేదు.+
25 ఐగుప్తు దేశమంతటా పొలంలో ఉన్న మనుషుల్ని, జంతువుల్ని, ప్రతీదాన్ని ఆ వడగండ్ల వాన నాశనం చేసింది. అది పొలంలో ఉన్న మొక్కలన్నిటినీ పాడుచేసింది, చెట్లన్నిటినీ కూల్చేసింది.+
26 ఇశ్రాయేలీయులు ఉన్న గోషెను ప్రాంతంలో మాత్రమే వడగండ్ల వాన కురవలేదు.+
27 కాబట్టి ఫరో మోషే, అహరోనుల్ని పిలిపించి వాళ్లతో ఇలా అన్నాడు: “ఈసారి నేను పాపం చేశాను. యెహోవా చేసింది సరైనదే. నేను, నా ప్రజలు చేసిందే తప్పు.
28 ఉరుములు, వడగండ్ల వాన ఆగిపోవాలని యెహోవాను వేడుకోండి. అప్పుడు నేను సంతోషంగా మిమ్మల్ని పంపించేస్తాను, ఇక ఎంతమాత్రం మిమ్మల్ని ఆపను.”
29 కాబట్టి మోషే అతనితో ఇలా అన్నాడు: “నేను ఈ నగరంలో నుండి బయటికి వెళ్లగానే యెహోవా ముందు నా చేతులు చాపి వేడుకుంటాను. అప్పుడు ఉరుములు, వడగండ్ల వాన ఆగిపోతాయి. దానివల్ల, భూమి యెహోవాదని నువ్వు తెలుసుకుంటావు.+
30 అయితే అప్పటికీ నువ్వు, నీ సేవకులు యెహోవా దేవునికి భయపడరని నాకు తెలుసు.”
31 జనుప, బార్లీ పంటలు కూడా వడగండ్ల వాన వల్ల పాడైపోయాయి. ఎందుకంటే, అప్పటికి బార్లీ మొక్కలు గింజ పట్టాయి, జనుప మొక్కలు మొగ్గ తొడిగాయి.
32 అయితే గోధుమ పంట, పొడుగు గోధుమల* పంట పాడవ్వలేదు. ఎందుకంటే, అవి ఆ తర్వాత కోతకు వస్తాయి.
33 మోషే ఫరో దగ్గర నుండి బయల్దేరి నగరం బయటికి వెళ్లి, యెహోవా ముందు తన చేతులు చాపి వేడుకున్నాడు. అప్పుడు ఉరుములు, వడగండ్ల వాన ఆగిపోయాయి; భూమ్మీద వర్షం కురవడం ఆగిపోయింది.+
34 వర్షం, వడగండ్లు, ఉరుములు ఆగిపోయాయని చూసినప్పుడు ఫరో, అతని సేవకులు మళ్లీ పాపం చేశారు, వాళ్లు తమ హృదయాల్ని కఠినం చేసుకున్నారు.+
35 యెహోవా మోషే ద్వారా ముందే చెప్పినట్టు, ఫరో హృదయం ఎప్పటిలాగే కఠినంగా ఉండిపోయింది, అతను ఇశ్రాయేలీయుల్ని పంపించలేదు.+

