నిర్గమకాండం 8:1-32

  • 2వ తెగులు: కప్పలు (1-15)

  • 3వ తెగులు: దోమలు (16-19)

  • 4వ తెగులు: జోరీగలు (20-32)

    • గోషెనుకు ఏమీ కాలేదు (22, 23)

8  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు: ‘యెహోవా ఏమంటున్నాడంటే, “నా ప్రజలు నన్ను సేవించేలా వాళ్లను పంపించేయి.+  ఒకవేళ నువ్వు వాళ్లను పంపిం​చడానికి ఇలాగే ఒప్పుకోకుండా ఉంటే, నేను నీ ప్రాంతమంతటినీ కప్పలతో బాధిస్తాను.+  అప్పుడు నైలు నది కప్పలతో నిండిపోతుంది. అవి పైకి వచ్చి నీ ఇంట్లోకి, నీ పడకగదిలోకి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇళ్లలోకి, నీ ప్రజల మీదికి వస్తాయి; నీ పొయ్యిల్లోకి, నీ పిండి పిసికే పాత్రల్లోకి* వెళ్తాయి.+  అవి నీ మీదికి, నీ ప్రజల మీదికి, నీ సేవకులందరి మీదికి వస్తాయి.” ’ ”  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు అహరోనుతో ఇలా చెప్పు: ‘నీ కర్రను పట్టుకొని నదుల మీద, నైలు నది కాలువల మీద, నీటి గుంటల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలు వచ్చేలా చేయి.’ ”  కాబట్టి అహరోను ఐగుప్తు నదుల మీద తన చెయ్యి చాపాడు, దాంతో కప్పలు వచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పేయడం మొదలుపెట్టాయి.  అయితే, ఇంద్రజాలం చేసే పూజారులు కూడా తమ రహస్య కళలు ఉపయోగించి అలాగే చేశారు, వాళ్లు కూడా ఐగుప్తు దేశం మీదికి కప్పలు రప్పించారు.+  తర్వాత ఫరో మోషే, అహరోనుల్ని పిలిపించి ఇలా అన్నాడు: “నా దగ్గర నుండి, నా ప్రజల దగ్గర నుండి కప్పల్ని తీసేయమని యెహోవాను వేడుకోండి.+ ఎందుకంటే యెహోవాకు బలులు అర్పించేలా నేను మీ ప్రజల్ని పంపించేయాలని అనుకుంటున్నాను.”  అప్పుడు మోషే ఫరోతో ఇలా అన్నాడు: “నీ దగ్గర నుండి, నీ సేవకుల దగ్గర నుండి, నీ ప్రజల దగ్గర నుండి, నీ ఇళ్లలో నుండి కప్పల్ని తీసేయమని నేను ఎప్పుడు వేడుకోవాలో నువ్వే చెప్పు, ఆ గౌరవం నీకే ఇస్తున్నాను. ఆ తర్వాత కప్పలు నైలు నదిలో మాత్రమే మిగిలి ఉంటాయి.” 10  దానికి ఫరో, “రేపు” అన్నాడు. అందుకు మోషే ఇలా అన్నాడు: “నీ మాట ప్రకారమే జరుగుతుంది. అప్పుడు మా దేవుడైన యెహోవా లాంటివాళ్లు ఎవరూ లేరని నువ్వు తెలుసుకుంటావు.+ 11  నీ దగ్గర నుండి, నీ ఇళ్లలో నుండి, నీ సేవకుల దగ్గర నుండి, నీ ప్రజల దగ్గర నుండి కప్పలు వెళ్లిపోతాయి. నైలు నదిలో మాత్రమే అవి మిగిలి ఉంటాయి.”+ 12  కాబట్టి మోషే, అహరోనులు ఫరో దగ్గర నుండి బయటికి వెళ్లిపోయారు. ఫరో మీదికి రప్పించిన కప్పల్ని తీసేయమని మోషే యెహోవాను వేడుకున్నాడు.+ 13  అప్పుడు యెహోవా మోషే అడిగినట్టే చేశాడు. దాంతో ఇళ్లలో, వాకిళ్లలో,* పొలాల్లో ఉన్న కప్పలు చచ్చిపోసాగాయి. 14  వాళ్లు వాటిని కుప్పలుకుప్పలుగా పోగేశారు. దాంతో దేశం కంపు కొట్టడం మొదలైంది. 15  పరిస్థితి మెరుగైందని ఫరో గమనించినప్పుడు, యెహోవా ముందే చెప్పినట్టు అతను తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు,+ వాళ్ల మాట వినలేదు. 16  అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు అహరోనుతో, ‘నీ కర్ర చాపి భూమ్మీదున్న ధూళిని కొట్టు, అది ఐగుప్తు ​దేశమంతటా దోమలుగా* మారుతుంది’ అని చెప్పు.” 17  అప్పుడు వాళ్లు అలాగే చేశారు. అహరోను తన చెయ్యి చాపి తన కర్రతో భూమ్మీదున్న ధూళిని కొట్టాడు, దాంతో మనుషుల మీదికి, జంతువుల మీదికి దోమలు వచ్చాయి. ఐగుప్తు దేశమంతటా ​భూమ్మీదున్న ధూళంతా దోమలుగా మారిపోయింది.+ 18  ఇంద్రజాలం చేసే ​పూజారులు కూడా తమ రహస్య కళలు ఉపయోగించి దోమల్ని పుట్టించడానికి ప్రయత్నిం​చారు,+ కానీ అది వాళ్ల వల్ల కాలేదు. దోమలు మనుషుల మీదికి, జంతువుల మీదికి వచ్చాయి. 19  కాబట్టి ఇంద్రజాలం చేసే పూజారులు ఫరోతో “ఇది దేవుని వ్రేలు!”+ అన్నారు. కానీ యెహోవా ముందే చెప్పినట్టు, ఫరో హృదయం ఎప్పటిలాగే కఠినంగా ఉండిపోయింది, అతను వాళ్ల మాట వినలేదు. 20  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు తెల్లవారుజామునే లేచి, వెళ్లి ఫరో ముందు నిలబడు. ఇదిగో! అతను నైలు నది దగ్గరికి వస్తున్నాడు! నువ్వు అతనితో ఇలా చెప్పాలి: ‘యెహోవా ఇలా అన్నాడు: “నన్ను సేవించేలా నా ప్రజల్ని పంపించేయి. 21  నువ్వు నా ప్రజల్ని పంపించకపోతే నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇళ్లలోకి జోరీగల్ని* పంపిస్తాను. ఐగుప్తులోని ఇళ్లు జోరీగలతో నిండిపోతాయి, అవి వాళ్లు* నిలబడిన నేలను కూడా కప్పేస్తాయి. 22  ఆ రోజున నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను ప్రాంతాన్ని వేరుగా ఉంచుతాను. అక్కడ జోరీగలు ఉండవు.+ దీనివల్ల, యెహోవానైన నేను ఇక్కడ ఈ దేశంలో ఉన్నానని నీకు తెలుస్తుంది.+ 23  నా ప్రజలకు, నీ ప్రజలకు మధ్య తేడా చూపిస్తాను. ఈ అద్భుతం రేపు జరుగుతుంది.” ’ ” 24  యెహోవా అలాగే చేశాడు. అప్పుడు జోరీగలు గుంపులుగుంపులుగా వచ్చి ఫరో ఇంటిమీద, అతని సేవకుల ఇళ్లమీద, ఐగుప్తు దేశమంతటి మీద దాడి చేయడం మొదలుపెట్టాయి.+ వాటివల్ల దేశం పాడైపోయింది.+ 25  ఫరో చివరికి మోషే, అహరోనుల్ని పిలిపించి, “వెళ్లండి, ఈ దేశంలోనే మీ దేవుడికి బలులు అర్పించుకోండి” అన్నాడు. 26  కానీ మోషే ఇలా అన్నాడు: “మేము అలా చేయలేం. ఎందుకంటే, మా దేవుడైన యెహోవాకు మేము బలి అర్పించబోయేవి ఐగుప్తీయులకు అసహ్యమైనవి.+ ఐగుప్తీయులు అసహ్యించుకునే బలిని వాళ్ల కళ్లముందే అర్పిస్తే, వాళ్లు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపరా? 27  కాబట్టి మా దేవుడు మాతో చెప్పినట్టే, మేము మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి ఎడారిలో మా దేవుడైన యెహోవాకు బలులు అర్పిస్తాం.”+ 28  అప్పుడు ఫరో ఇలా అన్నాడు: “మీరు ఎడారిలో మీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించేలా నేను మిమ్మల్ని పంపించేస్తాను. కాకపోతే ఒక్కమాట, మీరు మరీ దూరం వెళ్లకూడదు. నా తరఫున మీ దేవుణ్ణి వేడుకోండి.”+ 29  తర్వాత మోషే ఇలా అన్నాడు: “ఇప్పుడు నేను నీ దగ్గర నుండి వెళ్లిపోతున్నాను. నేను యెహోవాను వేడుకుంటాను. రేపు ఫరో దగ్గర నుండి, అతని సేవకుల దగ్గర నుండి, అతని ప్రజల దగ్గర నుండి జోరీగలు ​వెళ్లిపోతాయి. ​కాకపోతే, యెహోవాకు బలులు అర్పించడా​నికి ప్రజల్ని పంపించనని అంటూ ఫరో మాతో ఆటలు ఆడడం మానేయాలి.”+ 30  తర్వాత మోషే ఫరో దగ్గర నుండి వెళ్లిపోయి యెహోవాను వేడుకున్నాడు.+ 31  కాబట్టి యెహోవా మోషే మాట ప్రకారమే చేశాడు. దాంతో ఫరో దగ్గర నుండి, అతని సేవకుల దగ్గర నుండి, అతని ప్రజల దగ్గర నుండి జోరీగలు వెళ్లిపోయాయి. ఒక్కటి కూడా మిగల్లేదు. 32  అయితే ఫరో మళ్లీ తన హృదయాన్ని కఠినం చేసుకొని ఆ ప్రజల్ని పంపించలేదు.

అధస్సూచీలు

లేదా “తొట్లలోకి.”
లేదా “ప్రాంగణాల్లో.”
ఇవి ఐగు​ప్తులో సాధారణంగా కనిపించే దోమలాంటి చిన్న కీటకాలు.
ఇవి ఒకరకమైన కుట్టే ఈగలు.
అంటే, ఐగుప్తీయులు.