నిర్గమకాండం 11:1-10
11 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నేను ఫరో మీదికి, ఐగుప్తు మీదికి ఇంకొక తెగులు రప్పించబోతున్నాను. ఆ తర్వాత అతను మిమ్మల్ని ఇక్కడి నుండి పంపించేస్తాడు, నిజానికి అతను మిమ్మల్ని ఇక్కడినుండి వెళ్లగొడతాడు.+
2 కాబట్టి స్త్రీలు, పురుషులు అందరూ తమ ఇరుగుపొరుగువాళ్లను వెండి-బంగారు వస్తువులు అడిగి తీసుకోవాలని ప్రజలతో చెప్పు.”+
3 యెహోవా ఐగుప్తీయుల దృష్టిలో ఆ ప్రజలు అనుగ్రహం పొందేలా చేశాడు. అంతేకాదు, ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో సేవకుల దృష్టిలో, ప్రజల దృష్టిలో మోషే చాలా గొప్పవాడు అయ్యాడు.
4 తర్వాత మోషే ఫరోతో ఇలా అన్నాడు: “యెహోవా ఏం చెప్పాడంటే, ‘దాదాపు అర్ధరాత్రి సమయంలో నేను ఐగుప్తు మధ్యలోకి వెళ్తున్నాను.+
5 ఐగుప్తు దేశంలోని ప్రతీ మొదటి సంతానం చనిపోతుంది.+ తన సింహాసనంలో కూర్చున్న ఫరో మొదటి సంతానం దగ్గర నుండి తిరుగలి విసిరే దాసురాలి మొదటి సంతానం వరకు ప్రతీ మొదటి సంతానం చనిపోతుంది; పశువుల్లో కూడా ప్రతీ మొదటి సంతానం చనిపోతుంది.+
6 ఐగుప్తు దేశమంతటా గొప్ప ఏడ్పు వినిపిస్తుంది. అంత గొప్ప ఏడ్పు ఇప్పటివరకూ లేదు, ఇకమీదట కూడా ఉండదు.+
7 అయితే ఇశ్రాయేలీయుల్లోని మనుషుల్ని చూసి గానీ వాళ్ల పశువుల్ని చూసి గానీ కనీసం కుక్క కూడా మొరగదు. అప్పుడు, యెహోవా ఐగుప్తీయులకు, ఇశ్రాయేలీయులకు మధ్య తేడా చూపించగలడని మీకు తెలుస్తుంది.’+
8 నీ సేవకులందరూ ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి నాకు సాష్టాంగ నమస్కారం చేసి, ‘నువ్వూ, నీ ప్రజలందరూ వెళ్లిపోండి’ అని అంటారు. అప్పుడు నేను వెళ్లిపోతాను.” ఆ మాట అని అతను చాలా కోపంగా ఫరో దగ్గర నుండి వెళ్లిపోయాడు.
9 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఐగుప్తు దేశంలో నేను ఇంకా ఎక్కువ అద్భుతాలు చేసేలా+ ఫరో మీ మాట వినడు.”+
10 మోషే, అహరోనులు ఫరో ముందు ఈ అద్భుతాలన్నీ చేశారు. అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిచ్చాడు, కాబట్టి అతను ఇశ్రాయేలీయుల్ని తన దేశం నుండి పంపించలేదు.+