ఆదికాండం 41:1-57

  • ఫరో కలలకు యోసేపు అర్థం చెప్పడం (1-36)

  • ఫరో యోసేపును హెచ్చించడం (37-46ఎ)

  • యోసేపు ఆహార నిర్వహణ (46బి-57)

41  రెండు సంవత్సరాలు గడిచాక, ఫరోకు ఒక కల వచ్చింది.+ ఆ కలలో అతను నైలు నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. 2  అప్పుడు చూడచక్కగా ఉన్న ఏడు బలిసిన ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి, ఒడ్డున గడ్డి మేస్తూ ఉన్నాయి.+ 3  వాటి తర్వాత, వికారంగా, బక్కచిక్కిపోయి ఉన్న మరో ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి, ఒడ్డున ఉన్న బలిసిన ఆవుల పక్కన నిలబడ్డాయి. 4  తర్వాత వికారంగా, బక్కచిక్కిపోయి ఉన్న ఆవులు చూడచక్కగా ఉన్న ఏడు బలిసిన ఆవుల్ని తినడం మొదలుపెట్టాయి. అప్పుడు ఫరోకు మెలకువ వచ్చింది. 5  తర్వాత ఫరో మళ్లీ నిద్రపోయాడు, ఈసారి అతనికి ఇంకో కల వచ్చింది. ఆ కలలో, ఒకే దంటుకు పుష్టిగా ఉన్న ఏడు శ్రేష్ఠమైన వెన్నులు వచ్చాయి.+ 6  వాటి తర్వాత, తూర్పు గాలికి వాడిపోయిన ఏడు పీల వెన్నులు వచ్చాయి. 7  ఆ పీల వెన్నులు పుష్టిగా ఉన్న ఏడు శ్రేష్ఠమైన వెన్నుల్ని మింగేయడం మొదలుపెట్టాయి. అప్పుడు ఫరో నిద్రలేచి, అది కల అని గ్రహించాడు. 8  ఉదయమైనప్పుడు, అతను చాలా కలవరపడ్డాడు. కాబట్టి ఐగుప్తులోని ఇంద్రజాలం చేసే పూజారులందర్నీ, ఆ దేశంలోని జ్ఞానులందర్నీ పిలిపించి, తన కలల్ని వాళ్లకు చెప్పాడు. కానీ ఎవ్వరూ వాటి అర్థాన్ని అతనికి చెప్పలేకపోయారు. 9  అప్పుడు ప్రధాన పానదాయకుడు ఫరోతో ఇలా అన్నాడు: “ఈ రోజు నేను నా పాపాల్ని ఒప్పుకుంటున్నాను. 10  ఫరోకు తన సేవకులైన నా మీద, ప్రధాన వంటవాడి మీద విపరీతమైన కోపం వచ్చి మమ్మల్ని రాజ సంరక్షకుల అధిపతి కింద ఉన్న చెరసాలలో వేయించాడు.+ 11  ఆ తర్వాత, ఒకే రాత్రి మా ఇద్దరికీ ఒక్కో కల వచ్చింది. ఆ కలలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి.+ 12  అప్పుడు రాజ సంరక్షకుల అధిపతికి సేవకుడైన ఒక హెబ్రీ యువకుడు మాతోపాటు ఉన్నాడు.+ మా కలల్ని మేము అతనికి చెప్పినప్పుడు,+ అతను ఒక్కో కలకు ఉన్న అర్థాన్ని వివరించాడు. 13  సరిగ్గా అతను మాకు వివరించినట్టే జరిగింది. నా ఉద్యోగం నాకు తిరిగొచ్చింది, ప్రధాన వంటవాడినేమో వేలాడదీశారు.”+ 14  దాంతో ఫరో యోసేపును పిలిపించాడు.+ వాళ్లు అతన్ని త్వరగా చెరసాలలో*+ నుండి తీసుకొచ్చారు. అతను క్షౌరం చేయించుకొని, బట్టలు మార్చుకొని ఫరో దగ్గరికి వచ్చాడు. 15  అప్పుడు ఫరో యోసేపుతో ఇలా అన్నాడు: “నాకు ఒక కల వచ్చింది, కానీ దాని అర్థం చెప్పేవాళ్లు ఎవ్వరూ లేరు. నువ్వు కలల్ని విని, వాటి అర్థం చెప్పగలవని నేను విన్నాను.”+ 16  అందుకు యోసేపు ఫరోతో ఇలా అన్నాడు: “నాదేం లేదు! దేవుడే ఫరో క్షేమం గురించి చెప్తాడు.”+ 17  అప్పుడు ఫరో యోసేపుకు ఇలా చెప్పాడు: “నా కలలో, నేను నైలు నది ఒడ్డున నిలబడి ఉన్నాను. 18  అప్పుడు చూడచక్కగా ఉన్న ఏడు బలిసిన ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి, నైలు నది ఒడ్డున గడ్డిని మేయడం మొదలుపెట్టాయి.+ 19  వాటి తర్వాత బలహీనంగా, వికారంగా, బక్కచిక్కిపోయి ఉన్న మరో ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చాయి. ఐగుప్తు దేశమంతట్లో అంత వికారమైన ఆవుల్ని నేను ఎన్నడూ చూడలేదు. 20  బక్కచిక్కి వికారంగా ఉన్న ఆవులు బలిసివున్న మొదటి ఏడు ఆవుల్ని తినడం మొదలుపెట్టాయి. 21  కానీ, వాటిని తినేసిన తర్వాత కూడా అవి ఏమీ తిననట్టే కనిపించాయి; అవి మొదట్లో ఎంత వికారంగా బక్కచిక్కి ఉన్నాయో ఇప్పుడూ అంతే వికారంగా బక్కచిక్కి ఉన్నాయి. అంతలో నాకు మెలకువ వచ్చింది. 22  “ఆ తర్వాత నా కలలో, ఒకే దంటుకు పుష్టిగా ఉన్న ఏడు శ్రేష్ఠమైన వెన్నులు రావడం చూశాను.+ 23  వాటి తర్వాత ముడుచుకుపోయి, తూర్పు గాలికి వాడిపోయిన ఏడు పీల వెన్నులు వచ్చాయి. 24  తర్వాత ఆ పీల వెన్నులు పుష్టిగా ఉన్న ఏడు శ్రేష్ఠమైన వెన్నుల్ని మింగేయడం మొదలుపెట్టాయి. కాబట్టి నేను ఇంద్రజాలం చేసే పూజారులకు+ దాని గురించి చెప్పాను. కానీ ఎవ్వరూ దాని అర్థాన్ని నాకు చెప్పలేకపోయారు.”+ 25  అప్పుడు యోసేపు ఫరోతో ఇలా అన్నాడు: “ఫరోకు వచ్చిన రెండు కలల అర్థం ఒక్కటే. సత్యదేవుడు తాను చేయబోయేదాని గురించి ఫరోకు చెప్పాడు.+ 26  ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు. అలాగే, ఏడు మంచి వెన్నులు కూడా ఏడు సంవత్సరాలు. ఈ రెండు కలల అర్థం ఒక్కటే. 27  వాటి తర్వాత వచ్చిన బక్కచిక్కిన ఏడు చెడ్డ ఆవులు ఏడు సంవత్సరాలు. అలాగే తూర్పు గాలికి వాడిపోయిన గింజలులేని ఏడు వెన్నులు కరువు ఉండే ఏడు సంవత్సరాలు. 28  కాబట్టి నేను ఫరోకు చెప్పినట్టుగానే, సత్యదేవుడు తాను చేయబోయేదాన్ని ఫరోకు చూపించాడు. 29  “ఐగుప్తు దేశమంతటా చాలా సమృద్ధిగా పంటలు పండే ఏడు సంవత్సరాలు రాబోతున్నాయి. 30  కానీ వాటి తర్వాత ఖచ్చితంగా, కరువు ఉండే ఏడు సంవత్సరాలు వస్తాయి. అప్పుడు ప్రజలు ఐగుప్తు దేశంలోని సమృద్ధి అంతటినీ మర్చిపోతారు, ఆ కరువు దేశాన్ని పూర్తిగా పాడుచేస్తుంది.+ 31  తర్వాత వచ్చే ఈ కరువు ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ముందటి సంవత్సరాల్లో ఉన్న సమృద్ధిని ఎవ్వరూ గుర్తుచేసుకోరు. 32  సత్యదేవుడు త్వరలో దాన్ని జరిగించాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు కాబట్టే సత్యదేవుడు ఫరోకు ఆ కల రెండుసార్లు వచ్చేలా చేశాడు. 33  “కాబట్టి ఫరో ఇప్పుడు బుద్ధి, తెలివి ఉన్న ఒక వ్యక్తిని ఎంచుకొని, అతన్ని ఐగుప్తు దేశం మీద అధికారిగా నియమించాలి. 34  ఫరో ఈ దేశంలో పర్యవేక్షకుల్ని నియమించాలి, సమృద్ధిగా పంటలు పండే ఆ ఏడు సంవత్సరాల్లో+ ఐగుప్తు పంట నుండి ఐదో వంతును సేకరించాలి. 35  వాళ్లు రాబోయే ఆ మంచి సంవత్సరాల్లో ఆహారాన్నంతా సేకరించి, నగరాల్లో నిల్వచేసి భద్రపర్చాలి.+ ఆ ధాన్యం ఫరోకు చెందుతుంది. 36  ఐగుప్తులో రాబోయే ఏడు సంవత్సరాల కరువు కాలంలో ఆ ఆహారాన్ని దేశంలో పంచి పెట్టాలి. అప్పుడు ఆ కరువు వల్ల దేశం నాశనం కాకుండా ఉంటుంది.”+ 37  ఆ మాట ఫరోకు, అతని సేవకులందరికీ నచ్చింది. 38  కాబట్టి ఫరో తన సేవకులతో ఇలా అన్నాడు: “దేవుని శక్తి* పనిచేసే ఇతని లాంటివాళ్లు ఇంకెవరైనా దొరుకుతారా?” 39  తర్వాత ఫరో యోసేపుతో ఇలా అన్నాడు: “దేవుడు వీటన్నిటినీ నీకు బయల్పర్చాడు కాబట్టి నీ అంత బుద్ధి, తెలివి ఉన్నవాళ్లు ఎవ్వరూ లేరు. 40  నిన్ను నా ఇంటిమీద అధికారిగా నియమిస్తున్నాను. నా ప్రజలంతా అన్ని విషయాల్లో నీకు లోబడతారు.+ కేవలం రాజుగా ఉండే* విషయంలో మాత్రమే నేను నీ పైస్థానంలో ఉంటాను.” 41  ఫరో యోసేపుతో ఇంకా ఇలా అన్నాడు: “చూడు, నిన్ను ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా నియమిస్తున్నాను.”+ 42  ఆ తర్వాత ఫరో తన ముద్ర-ఉంగరాన్ని తన చేతి నుండి తీసి యోసేపు చేతికి పెట్టాడు, అతనికి సన్నని నారబట్టలు తొడిగించాడు, మెడకు బంగారు హారం వేశాడు. 43  అంతేకాదు, ఘనతకు సూచనగా ఉన్న తన రెండో రథం మీద అతన్ని ఊరేగించాడు. జనం అతని ముందు వెళ్తూ, “అవ్రెఖ్‌! అవ్రెఖ్‌!”* అని కేకలువేశారు. అలా ఫరో అతన్ని ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా నియమించాడు. 44  ఫరో యోసేపుతో ఇంకా ఇలా అన్నాడు: “నేను ఫరోను, కానీ నీ ఆమోదం లేకుండా ఐగుప్తు దేశమంతటా ఎవ్వరూ ఏ పనీ చేయకూడదు.”*+ 45  తర్వాత ఫరో యోసేపుకు జఫెనత్‌-పనేహు అని పేరు పెట్టి, ఓను* పూజారైన పోతీఫెర కూతురు ఆసెనతును+ ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత యోసేపు ఐగుప్తు దేశాన్ని పర్యవేక్షించడం* మొదలుపెట్టాడు.+ 46  ఐగుప్తు రాజైన ఫరో ముందు నిలబడినప్పుడు* యోసేపు వయసు 30 ఏళ్లు.+ తర్వాత యోసేపు ఫరో ముందు నుండి వెళ్లిపోయి, ఐగుప్తు దేశమంతటా ప్రయాణించాడు. 47  సమృద్ధిగల ఏడు సంవత్సరాల్లో ఆ దేశంలో పంటలు పుష్కలంగా పండాయి. 48  అతను ఆ ఏడు సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పండిన ఆహారాన్నంతా సేకరిస్తూ, దాన్ని నగరాల్లో నిల్వ చేయించేవాడు; ఏ నగరం చుట్టుపక్కల పొలాల్లో పండిన పంటను ఆ నగరంలోనే నిల్వ చేయించేవాడు. 49  యోసేపు ఎంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని సేకరిస్తూ ఉన్నాడంటే, అది సముద్రపు ఇసుకంత అయ్యింది. చివరికి దాన్ని కొలవడం వీలుకాక కొలవడం మానేశారు. 50  కరువు మొదలవ్వకముందు, ఓను* పూజారైన పోతీఫెర కూతురు ఆసెనతు ద్వారా యోసేపుకు ఇద్దరు కుమారులు పుట్టారు.+ 51  యోసేపు తన పెద్ద కుమారునికి మనష్షే*+ అని పేరు పెట్టాడు. ఎందుకంటే “దేవుడు నా కష్టాన్నంతా, నా తండ్రి ఇంటినంతా మర్చిపోయేలా చేశాడు” అని యోసేపు అన్నాడు. 52  అలాగే అతను, “నేను బాధలుపడిన దేశంలో+ దేవుడు నాకు పిల్లల్ని దయచేశాడు”* అంటూ తన రెండో కుమారునికి ఎఫ్రాయిము*+ అని పేరు పెట్టాడు. 53  తర్వాత ఐగుప్తులో సమృద్ధిగల ఏడు సంవత్సరాలు ముగిసి,+ 54  ఏడు సంవత్సరాల కరువు మొదలైంది. అదంతా యోసేపు చెప్పినట్టే జరిగింది.+ అన్నిదేశాల్లో కరువు మొదలైంది, కానీ ఐగుప్తు దేశంలో మాత్రం అన్నిచోట్లా ఆహారం ఉంది.+ 55  మెల్లమెల్లగా, ఐగుప్తు దేశమంతటా కరువు వ్యాపించింది. దాంతో ప్రజలు ఫరో దగ్గరికి వెళ్లి ఆహారం కోసం మొరపెట్టుకున్నారు.+ అప్పుడు ఫరో ఐగుప్తీయులందరితో, “మీరు యోసేపు దగ్గరికి వెళ్లి అతను మీకు ఏం చెప్తే అది చేయండి”+ అన్నాడు. 56  ఆ కరువు భూమంతటా వ్యాపించింది.+ ఐగుప్తు దేశంలో కరువు భారం ఎక్కువగా ఉండడంతో, యోసేపు వాళ్ల మధ్య ఉన్న గోదాములన్నిటినీ తెరిపించి, ఆ ధాన్యాన్ని ఐగుప్తీయులకు అమ్మడం మొదలుపెట్టాడు.+ 57  అంతేకాదు, భూమంతటా కరువు విపరీతంగా ఉన్నందువల్ల అన్నిదేశాల ప్రజలు యోసేపు దగ్గర ధాన్యాన్ని కొనుక్కోవడానికి ఐగుప్తుకు వచ్చారు.+

అధస్సూచీలు

అక్ష., “బావిలో; గుంటలో.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “సింహాసనం.”
ఇది గౌరవాన్ని, ఘనతను ఇవ్వాలని సూచించే పదం అని తెలుస్తోంది.
అక్ష., “తన చేతినైనా, కాలునైనా ఎత్తకూడదు.”
అంటే, హీలియోపొలిస్‌.
లేదా “దేశమంతటా ప్రయాణించడం.”
లేదా “ఫరోకు సేవచేయడం మొదలుపెట్టినప్పుడు.”
అంటే, హీలియోపొలిస్‌.
“మర్చిపోయేలా చేసేవాడు” అని అర్థం.
లేదా “దేవుడు నేను ఫలించేలా చేశాడు.”
“రెండింతలు ఫలించడం” అని అర్థం.