అపొస్తలుల కార్యాలు 10:1-48
10 కైసరయలో కొర్నేలి అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఇటలీ దళంలో* సైనికాధికారి.*
2 అతను దైవభక్తి గలవాడు. అతను, అతని ఇంటివాళ్లందరూ దేవునికి భయపడేవాళ్లు. అతను ప్రజలకు ఎన్నో దానధర్మాలు చేసేవాడు. ఎప్పుడూ పట్టుదలగా దేవునికి ప్రార్థించేవాడు.
3 ఒకరోజు, మధ్యాహ్నం దాదాపు మూడింటికి*+ అతనికి ఒక దర్శనం వచ్చింది. దానిలో అతను, ఒక దేవదూత తన దగ్గరికి రావడం స్పష్టంగా చూశాడు. ఆ దేవదూత అతన్ని, “కొర్నేలీ!” అని పిలిచాడు.
4 కొర్నేలి భయపడి ఆ దేవదూతనే చూస్తూ, “ఏంటి ప్రభూ?” అని అడిగాడు. ఆ దేవదూత అతనితో ఇలా అన్నాడు: “నీ ప్రార్థనలు, దానధర్మాలు దేవుని సన్నిధికి చేరాయి. దేవుడు వాటిని గుర్తుచేసుకున్నాడు.+
5 కాబట్టి యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అని పిలవబడే సీమోనును పిలిపించు.
6 అతను సముద్రతీరాన ఉన్న సీమోను అనే చర్మకారుడి ఇంట్లో అతిథిగా ఉన్నాడు.”
7 అతనితో మాట్లాడిన దేవదూత వెళ్లిపోగానే కొర్నేలి ఇద్దరు సేవకుల్ని, తనకు ఎప్పుడూ సేవచేసే సైనికుల్లో దైవభక్తిగల ఒకతన్ని పిలిచాడు.
8 అతను జరిగిందంతా వాళ్లకు చెప్పి, వాళ్లను యొప్పేకు పంపించాడు.
9 తర్వాతి రోజు వాళ్లు ప్రయాణిస్తూ ఆ నగరం దగ్గరికి చేరుకున్నారు. ఆ సమయంలో పేతురు ప్రార్థించడానికి మిద్దె మీదికి వెళ్లాడు. అప్పుడు మధ్యాహ్నం దాదాపు 12 గంటలు* అయింది.
10 అతనికి బాగా ఆకలి వేయడంతో ఏమైనా తినాలనుకున్నాడు. భోజనం సిద్ధమౌతుండగా, అతనికి ఒక దర్శనం వచ్చింది.*+
11 ఆకాశం తెరవబడడం, పెద్ద దుప్పటి లాంటిదాన్ని నాలుగు మూలల్లో పట్టుకొని భూమ్మీదికి దించడం అతను చూశాడు.
12 భూమ్మీద ఉండే అన్నిరకాల నాలుగు కాళ్ల జంతువులు, పాకే జీవులు,* ఆకాశపక్షులు అందులో ఉన్నాయి.
13 అప్పుడు ఒక స్వరం పేతురుతో, “పేతురూ, లేచి వాటిని చంపుకొని తిను!” అని చెప్పింది.
14 కానీ పేతురు, “లేదు ప్రభువా, నేను అలా చేయలేను. ధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధమైనదేదీ, అపవిత్రమైనదేదీ నేను ఎప్పుడూ తినలేదు” అన్నాడు.+
15 ఆ స్వరం రెండోసారి అతనితో మాట్లాడి, “దేవుడు పవిత్రపర్చిన వాటిని నిషిద్ధమైనవని అనొద్దు” అని చెప్పింది.
16 మూడోసారి కూడా అలాగే జరిగింది. తర్వాత వెంటనే ఆ దుప్పటి లాంటిది ఆకాశానికి ఎత్తబడింది.
17 ఆ దర్శనానికి అర్థం ఏమైవుంటుందో అని పేతురు కలవరపడుతుండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఎక్కడుందో అడిగి తెలుసుకొని, అప్పుడే అతని ఇంటి గుమ్మం దగ్గర నిలబడి,+
18 సీమోను పేతురు అక్కడ అతిథిగా ఉన్నాడా అని బిగ్గరగా అడిగారు.
19 పేతురు ఇంకా ఆ దర్శనం గురించే ఆలోచిస్తుండగా, దేవుడు తన పవిత్రశక్తి ద్వారా ఇలా చెప్పాడు:+ “ఇదిగో! ముగ్గురు మనుషులు నీ గురించి అడుగుతున్నారు.
20 నువ్వు లేచి, కిందికి దిగి, ఏమాత్రం సందేహించకుండా వాళ్లతో వెళ్లు. ఎందుకంటే నేనే వాళ్లను పంపించాను.”
21 అప్పుడు పేతురు కిందికి దిగి, “మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే. మీరు ఎందుకు వచ్చారు?” అని ఆ మనుషుల్ని అడిగాడు.
22 దానికి వాళ్లు ఇలా చెప్పారు: “సైనికాధికారి కొర్నేలి+ నీతిపరుడు, దేవునికి భయపడే వ్యక్తి. యూదులందరి మధ్య అతనికి మంచిపేరు ఉంది. దేవుడు ఒక పవిత్ర దేవదూతను కొర్నేలి దగ్గరికి పంపి, నిన్ను ఇంటికి పిలిపించుకొని, నువ్వు చెప్పేది వినమని అతన్ని ఆదేశించాడు.”
23 కాబట్టి అతను వాళ్లను లోపలికి పిలిచి, అతిథి మర్యాదలు చేశాడు.
తర్వాతి రోజు అతను లేచి వాళ్లతో వెళ్లాడు. యొప్పేకు చెందిన కొంతమంది సహోదరులు కూడా అతనితో వెళ్లారు.
24 ఆ తర్వాతి రోజు అతను కైసరయకు చేరుకున్నాడు. కొర్నేలి వాళ్లకోసం ఎదురుచూస్తూ తన బంధువుల్ని, దగ్గరి స్నేహితుల్ని అక్కడికి పిలిపించాడు.
25 పేతురు వచ్చినప్పుడు, కొర్నేలి అతన్ని కలుసుకొని, అతని పాదాల దగ్గర పడి, అతనికి వంగి నమస్కారం చేశాడు.
26 అయితే పేతురు, “లే, నేను కూడా మనిషినే”+ అంటూ అతన్ని పైకి లేపాడు.
27 తర్వాత అతనితో మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లి, అక్కడ చాలామంది ఉండడం చూశాడు.
28 అప్పుడు పేతురు వాళ్లతో ఇలా అన్నాడు: “యూదుల చట్టం ప్రకారం, యూదులు అన్యజనులతో సహవాసం చేయడం గానీ, వాళ్లను కలవడం గానీ ఎంత తప్పో+ మీకు బాగా తెలుసు. అయినాసరే, నేను ఏ మనిషినీ అపవిత్రుడిగా ఎంచకూడదని దేవుడు నాకు చూపించాడు.+
29 అందుకే మీరు నా కోసం మనుషుల్ని పంపినప్పుడు, ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. ఇంతకీ మీరు నన్ను ఎందుకు పిలిచారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను.”
30 అప్పుడు కొర్నేలి ఇలా చెప్పాడు: “నాలుగు రోజుల క్రితం సరిగ్గా ఇదే సమయానికి అంటే మధ్యాహ్నం దాదాపు మూడింటికి* నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు, మెరిసే వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి నా ముందు నిలబడి
31 ఇలా అన్నాడు: ‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీ దానధర్మాలు గుర్తుచేసుకున్నాడు.
32 కాబట్టి యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అనబడే సీమోనును పిలిపించు. అతను సముద్రతీరాన ఉన్న సీమోను అనే చర్మకారుడి ఇంట్లో అతిథిగా ఉన్నాడు.’+
33 అప్పుడు నేను వెంటనే నీ కోసం మనుషుల్ని పంపాను. నువ్వు ఇక్కడికి వచ్చి మంచిపని చేశావు. ఏ విషయాల్ని చెప్పమని యెహోవా* నీకు ఆజ్ఞాపించాడో వాటిని వినడానికి మేమంతా ఇప్పుడు దేవుని ముందు సిద్ధంగా ఉన్నాం.”
34 అప్పుడు పేతురు మాట్లాడడం మొదలుపెట్టి ఇలా అన్నాడు: “దేవునికి పక్షపాతం లేదని+ నాకు ఇప్పుడు నిజంగా అర్థమైంది.
35 ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.+
36 ఆయన ఇశ్రాయేలు ప్రజలకు యేసుక్రీస్తు ద్వారా శాంతి గురించిన మంచివార్త ప్రకటించి,+ వాళ్లకు ఒక సందేశాన్ని పంపించాడు. ఈ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు.+
37 యోహాను బాప్తిస్మం గురించి ప్రకటించిన తర్వాత, గలిలయ దగ్గర మొదలుపెట్టి+ యూదయ అంతట ప్రజలు ఏ అంశం గురించి మాట్లాడుకున్నారో మీకు తెలుసు.
38 వాళ్లు నజరేతుకు చెందిన యేసు గురించి మాట్లాడుకున్నారు. దేవుడు ఆయన్ని పవిత్రశక్తితో అభిషేకించాడు.+ ఆయనకు శక్తిని ఇచ్చాడు. దానివల్ల ఆయన మంచిపనులు చేస్తూ, అపవాది చేత పీడించబడుతున్న వాళ్లను బాగుచేస్తూ+ ఆ ప్రాంతమంతా తిరిగాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు.+
39 యూదుల దేశంలో, యెరూషలేములో ఆయన చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. అయితే వాళ్లు ఆయన్ని కొయ్యకు* వేలాడదీసి చంపేశారు.
40 దేవుడు మూడో రోజున ఆయన్ని బ్రతికించి,+ ఆయన ప్రజలకు కనిపించేలా* చేశాడు.
41 అయితే దేవుడు ఆయన్ని అందరికీ కనిపించేలా చేయలేదు కానీ ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతోపాటు తిని తాగిన మాకు మాత్రమే కనిపించేలా చేశాడు.+ ఆయన్ని చూసేలా, ఆయన గురించి మాట్లాడేలా దేవుడు ముందే మమ్మల్ని నియమించాడు.
42 అంతేకాదు బ్రతికున్నవాళ్లకు, చనిపోయినవాళ్లకు తీర్పు తీర్చడానికి దేవుడు న్యాయమూర్తిగా నియమించిన వ్యక్తి+ ఈయనే అని ప్రజలకు ప్రకటించమని, పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వమని కూడా ఆయన మాకు ఆజ్ఞాపించాడు.+
43 ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చారు.+ ఆయన మీద విశ్వాసముంచే ప్రతీ ఒక్కరి పాపాలు ఆయన పేరు ద్వారా క్షమించబడతాయని+ వాళ్లు చెప్పారు.”
44 పేతురు ఈ విషయాల గురించి మాట్లాడుతుండగానే, వాక్యం వింటున్న వాళ్లందరి మీదికి పవిత్రశక్తి వచ్చింది.+
45 పవిత్రశక్తి అనే ఉచిత బహుమతిని అన్యజనులు కూడా పొందడం చూసి, పేతురుతో పాటు వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు* ఎంతో ఆశ్చర్యపోయారు.
46 ఎందుకంటే, అక్కడున్నవాళ్లు వేరే భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి మహిమపర్చడం వాళ్లు విన్నారు.+ అప్పుడు పేతురు ఇలా అన్నాడు:
47 “వీళ్లు మనలాగే పవిత్రశక్తిని పొందారు కాబట్టి వీళ్లు నీళ్లలో బాప్తిస్మం తీసుకోకుండా ఎవరైనా ఆపగలరా?”+
48 దాంతో పేతురు, వాళ్లు యేసుక్రీస్తు పేరున బాప్తిస్మం తీసుకోవాలని ఆజ్ఞాపించాడు.+ తర్వాత వాళ్లు కొన్ని రోజులు తమ దగ్గరే ఉండమని అతన్ని వేడుకున్నారు.
అధస్సూచీలు
^ ఇందులో 600 మంది రోమా సైనికులు ఉండేవాళ్లు.
^ లేదా “శతాధిపతి,” ఇతని కింద 100 మంది సైనికులు ఉండేవాళ్లు.
^ అక్ష., “దాదాపు తొమ్మిదో గంట అప్పుడు.”
^ అక్ష., “దాదాపు ఆరో గంట.”
^ లేదా “అతను పరవశుడయ్యాడు.”
^ లేదా “సరీసృపాలు.”
^ అక్ష., “తొమ్మిదో గంట అప్పుడు.”
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “చెట్టుకు.”
^ లేదా “వెల్లడయ్యేలా.”
^ లేదా “నమ్మకమైనవాళ్లు.”