సవాలు ఎలా పరిష్కారం అవుతుంది

దేవుని రాజ్యంలో ‘క్షేమాభివృద్ధి కలుగుతుంది’

దేవుని రాజ్యంలో ‘క్షేమాభివృద్ధి కలుగుతుంది’

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న దేవుని రాజ్యం, దేవుడు స్థాపించిన ప్రపంచవ్యాప్త ప్రభుత్వం భూమంతటా శాంతిని, సామరస్యాన్ని తీసుకొస్తుంది. కీర్తన 72:7లో వాగ్దానం చేయబడినట్లు ‘క్షేమాభివృద్ధి కలుగుతుంది.’ కానీ ఆ రాజ్యం భూమంతటా ఎప్పుడు పరిపాలన మొదలుపెడుతుంది? ఎలా మొదలుపెడుతుంది? ఆ పరిపాలన తెచ్చే ప్రయోజనాలు అనుభవించాలంటే మీరు ఏమి చేయాలి?

దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది?

దేవుని రాజ్యం త్వరలోనే రాబోతుందని సూచించే ఎన్నో స్పష్టమైన సంఘటనల గురించి బైబిలు ముందే చెప్పింది. ఆ సంఘటనలన్నిటినీ కలిపి “సూచన” అనడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, కరువులు, రోగాలు, ఎన్నో భూకంపాలు, అన్యాయం విపరీతంగా పెరిగిపోవడం ఇవన్నీ ఆ సూచనలో ఉన్నాయి.—మత్తయి 24:3, 7, 12; లూకా 21:11; ప్రకటన 6:2-8.

మరో ప్రవచనం ఇలా చెప్తుంది: “చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: స్వార్థపరులు, డబ్బును ప్రేమించేవాళ్లు, . . . అమ్మానాన్నలకు లోబడనివాళ్లు, కృతజ్ఞత లేనివాళ్లు, నమ్మకంగా ఉండనివాళ్లు, మమకారం లేనివాళ్లు, మొండివాళ్లు, లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు, మంచిని ప్రేమించనివాళ్లు, . . . గర్వంతో ఉబ్బిపోయేవాళ్లు, దేవుణ్ణి కాకుండా సుఖాల్ని ప్రేమించేవాళ్లు.” (2 తిమోతి 3:1-4) ఇలాంటి లక్షణాలున్న ప్రజలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. కానీ నేడు మాత్రం ఎక్కువమంది ఇలానే ఉన్నారు.

ఈ ప్రవచనాలు 1914 నుండి నెరవేరడం మొదలయ్యాయి. నిజం చెప్పాలంటే, ఆ సంవత్సరం తర్వాత ప్రపంచం ఎంతగా మారిపోయిందో చరిత్రకారులు, రాజనీతి నిపుణులు, రచయితలు కూడా తెలియజేశారు. ఉదాహరణకు డానిష్‌ చరిత్రకారుడైన పిటర్‌ మంక్‌ ఇలా రాశాడు: “1914లో మొదలైన యుద్ధం మానవజాతి చరిత్రలోనే గొప్ప మలుపని చెప్పుకోవాలి. గొప్ప అభివృద్ధి బాటలో సాగుతున్న కాలం నుండి, . . . ఒక్కసారిగా మనం ఎక్కడచూసినా వినాశనం, భయం, ద్వేషం, అభద్రతతో నిండిపోయిన కాలంలోకి ప్రవేశించాం.”

కానీ సానుకూలంగా ఆలోచిస్తే, ఒక పెద్ద తుఫాను తర్వాత అంతా ఎలా ప్రశాంతంగా మారిపోతుందో, ఈ పరిస్థితులు కూడా అలాంటివేనని చెప్పొచ్చు. భూమంతటా రాజ్య పరిపాలన మొదలయ్యే సమయం దగ్గర పడిందని అవి చూపిస్తున్నాయి. నిజానికి, అంతం గురించిన సూచన చెప్తూ, యేసు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాడు: “అన్ని దేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, రాజ్యం గురించిన మంచివార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.”—మత్తయి 24:14.

యెహోవాసాక్షులు ప్రకటించే సందేశంలో ప్రధాన అంశం ఆ మంచివార్తే. నిజానికి, వాళ్ల ముఖ్య పత్రిక పేరు కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తుంది. ఈ పత్రిక, దేవుని రాజ్యం మనుషులకు, భూమికి చేయబోయే అద్భుతమైన విషయాల గురించి క్రమంగా చర్చిస్తుంది.

దేవుని రాజ్యం భూమంతటినీ పరిపాలించడం ఎలా మొదలుపెడుతుంది?

దీని జవాబులో ఈ నాలుగు వాస్తవాలు ఉన్నాయి:

  1. ఈ రాజ్యం నేడు ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులచేత గానీ వాళ్ల ద్వారా గానీ పనిచేయదు.

  2. ఈ లోకంలో రాజకీయ నాయకులు, అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మూర్ఖంగా దేవుని రాజ్యంపై పోరాటం చేస్తారు.—కీర్తన 2:2-9.

  3. మనుషులపై పెత్తనం చెలాయిస్తూ ఉండాలని కోరుకునే మానవ రాజ్యాలను, దేవుని రాజ్యం నాశనం చేయాల్సి ఉంటుంది. (దానియేలు 2:44; ప్రకటన 19:17-21) ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఈ చివరి పోరాటాన్ని అర్మగిద్దోను అంటారు.—ప్రకటన 16:14, 16.

  4. ఇష్టపూర్వకంగా దేవుని రాజ్యానికి లోబడేవాళ్లందరూ అర్మగిద్దోనులో కాపాడబడి, శాంతియుతమైన నూతనలోకంలోకి ప్రవేశిస్తారు. బహుశా లక్షల సంఖ్యలో ఉండే వీళ్లందరినీ, బైబిలు “గొప్ప సమూహం” అని పిలుస్తుంది.—ప్రకటన 7:9, 10, 13, 14.

రాజ్య పరిపాలన తెచ్చే ప్రయోజనాలు అనుభవించాలంటే మీరు ఏమి చేయాలి?

దేవుని రాజ్యంలో ఉండాలంటే మనం చేయాల్సిన మొదటి పని విద్యని అభ్యసించడం. నిజానికి, యేసు దేవునికి ప్రార్థిస్తూ ఇలా అన్నాడు: “ఒకేఒక్క సత్య దేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.”—యోహాను 17:3.

ప్రజలు యెహోవా దేవుణ్ణి ఒక వ్యక్తిగా తెలుసుకున్నప్పుడు, చాలా రకాలుగా వాళ్లు ప్రయోజనం పొందుతారు. వాటిలో రెండిటిని గమనించండి: మొదటిది, ఆయన మీద బలమైన విశ్వాసాన్ని పెంచుకుంటారు. రుజువులు ఆధారంగా పొందిన అలాంటి విశ్వాసం వల్ల, దేవుని రాజ్యం నిజమైనదని, త్వరలోనే అది మనల్ని పరిపాలిస్తుందని వాళ్లు ఒప్పించబడతారు. (హెబ్రీయులు 11:1) రెండవది వాళ్లకు దేవుని మీద, తోటివాళ్ల మీద ఉన్న ప్రేమ పెరుగుతుంది. దేవుని మీద ప్రేమ, హృదయపూర్వకంగా ఆయనకు లోబడేలా వాళ్లను కదిలిస్తుంది. తోటివాళ్ల మీద ప్రేమ, తరచూ బంగారు సూత్రంగా పిలవబడే యేసు మాటల్ని పాటించేలా వాళ్లను కదిలిస్తుంది. ఆ సూత్రం ఇలా చెప్తుంది: “ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించండి.”—లూకా 6:31.

ఒక ప్రేమగల తండ్రిలా మన సృష్టికర్త, మనం అత్యుత్తమమైన వాటిని పొందాలని కోరుకుంటాడు. బైబిలు పిలిచే “వాస్తవమైన” జీవితాన్ని మనం అనుభవించాలన్నది ఆయన కోరిక. (1 తిమోతి 6:19) నేడున్న జీవితం “వాస్తవమైన జీవితం” కాదు. లక్షలమంది ప్రజలకు జీవితం చాలా కష్టంగా ఉంది, ప్రతీరోజు జీవించడానికి వాళ్లు పెద్ద పోరాటమే చేస్తున్నారు. అయితే “వాస్తవమైన జీవితం” ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, దేవుని రాజ్యం దాని పౌరులకు ఎలాంటి అద్భుతమైన వాటిని చేస్తుందో కొన్నిటిని ఇప్పుడు పరిశీలిద్దాం.

దేవుని రాజ్య పరిపాలనలో ప్రజలు శాంతిభద్రతలను అనుభవిస్తారు. వాళ్లకు సమృద్ధిగా ఆహారం ఉంటుంది